అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
శనివారం కాబూల్ లోని ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపు ఈ ఘటన చోటు చేసుకుంది.
కాబూల్: ఆఫ్గనిస్థాన్లోని కాబూల్లో భారత దౌత్య కార్యాలయం సమీపంలో మొన్న సంభవించిన భారీ పేలుళ్ల ఘటన నుంచి తేరుకోకముందే.. మరోసారి కాబూల్ బాంబుల మోతతో దద్దరిల్లింది.
శనివారం కాబూల్ లోని ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ పేలుళ్లలో 18 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవల కాబూల్లో జరిగిన భారీ పేలుళ్లకు నిరసనగా ఆ ప్రాంతంలో నిన్న భారీ ర్యాలీ చేపట్టారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో సెనేటర్ ఎజద్యార్ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోజు అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మళ్లీ ఈ వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది.