ఆఫ్ఘన్లో బమియాన్ బుద్ధ విగ్రహాలు మెరిశాయ్!
కాబూల్: ఆప్ఘనిస్తాన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బమియాన్ బుద్ధ విగ్రహాలు మళ్లీ మెరిశాయి! 2001లో తాలిబన్లు డైనమేట్లతో వాటిని పేల్చారు. అలా పేల్చేసిన 1500 ఏళ్ల నాటి భారీ విగ్రహాల పునరుద్ధరణకు చైనాకు చెందిన జాన్సన్ యూ, లియాన్ హుల జంట నడుం బిగించింది.
ఆధునిక త్రీడీ లేజర్ లైట్ ప్రొజెక్షన్ సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ వెలుగులు రప్పించారు. ఈ నెల 7న అనుమతులతో 115, 174 అడుగుల ఎత్తైన రెండు బుద్ధ విగ్రహాలకు లేజర్ వెలుగులతో నిలబెట్టారు.
3డి లేజర్ లైట్ ప్రొజెక్షన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బుద్ధుడి వర్చువల్ బొమ్మలను సృష్టించడం ద్వారా బమియాన్ లోయకు చైనీస్ జంట మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చింది.
2001లో ఈ విగ్రహాల ధ్వంసం పట్ల విచారం వ్యక్తం చేసిన చైనీస్ జంట.. అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో పాటు యునెస్కో నుంచి అనుమతి తీసుకుని ఈ ప్రాజెక్టు చేపట్టిన వారు ఈ నెల 7వ తేదీన రాత్రికి రాత్రే పని పూర్తి చేశారు.
ప్రొజెక్టర్ల సహాయంతో బుద్ధుడి భారీ హాలోగ్రఫిక్ విగ్రహాలను ప్రదర్శించి అందరికీ కనువిందు చేశారు. బమియాన్ లోయలో తాలిబన్ తీవ్రవాదులు ధ్వంసం చేసిన ఇసుకరాతి (శాండ్ స్టోన్) బుద్ధ విగ్రహాలకు ఇవి అచ్చుగుద్దినట్లు ఉన్నాయి. ఎంతగానో ప్రశంసలు పొందిన ఈ ప్రదర్శనను 150 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగా, వారిలో చాలా మంది ఆ రాత్రంతా అక్కడే గడిపారు.