కుప్పకూలిన సైనిక హెలికాప్టర్: 20మంది మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్లో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరా ప్రావిన్స్లోని అనార్ దరా జిల్లా నుంచి హెరత్ ప్రావెన్స్కు బయల్దేరిన ఓ సైనిక హెలికాప్టర్ బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది.
అనార్ దరా బేస్ నుంచి హెలికాప్టర్ టేకాప్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో హెలికాప్టర్లో '207 జాఫర్ మిలిటరీ కార్ప్స్' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 20 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్ మిలిటరీ కార్ప్స్ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు.
188మందితో సముద్రంలో కుప్పకూలిన విమానం: నడిపింది ఇండియన్ పైలట్, బదిలీ కోరిన నెలల్లోనే..
మృతుల్లో ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ చీఫ్ ఫరీద్ భక్తావర్, 207 జాఫర్ మిలిటరీ కార్ప్స్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ నెమతుల్లా ఖలీల్ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 188మంది ప్రయాణికులతో కూడిన ఇండోనేషియా విమానం ఇటీవలే సముద్రంలో పడిన దుర్ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.