ఎంపీలా మజాకా: రన్వేపై రాళ్లు పెట్టి విమానాన్నే వెనక్కి రప్పించారు!
ఏ దేశంలోనైనా ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పేమీ లేదు. మనదేశంలో ఓ ఎంపీ విమాన సిబ్బందిని చెప్పుతో కొట్టి వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
కాబూల్: ఏ దేశంలోనైనా ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పేమీ లేదు. మనదేశంలో ఓ ఎంపీ విమాన సిబ్బందిని చెప్పుతో కొట్టి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్లో ఆ దేశ ఎంపీలు ఏకంగా విమానాన్నే వెనక్కి రప్పించి తమ ఆగ్రహాన్ని చల్లార్చుకున్నారు.
వివరాల్లోకివ వెళితే.. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఎంపీలు అబ్దుల్ రెహమాన్ షహీదని, హుస్సేన్ నసేరి కాబుల్ నుంచి బమియాన్ వెళ్లాల్సి ఉంది. కానీ, వారిద్దరూ ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకోవడంతో విమానం మిస్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఎంపీలు బమియాన్లోని వారి మద్దతుదారులకు చెప్పి విమానం ల్యాండ్ అవకుండా చేశారు.
బమియన్ విమానాశ్రయం రన్వేపై అడ్డంగా రాళ్లు పెట్టడంతో విమానం దిగేందుకు కుదరలేదు. దీంతో చేసేదేమి లేక విమానాన్ని మళ్లీ కాబూల్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం తిరిగి రాగానే ఆ ఎంపీలు విమానం ఎక్కి బమియాన్ చేరుకున్నారు.
కాగా, ఆ సమయంలో విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ విమానాన్ని నిబంధనలకు విరుద్ధంగా వెనక్కి తీసుకొచ్చినట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ హుమాయున్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో విమానం భద్రతా సిబ్బందితో సహా ఐదుగురుని అరెస్టు చేసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే, ఆ ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అంతేగాక, అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఆ దేశ ఎంపీలకు కొత్తేం కాదని తెలిసింది.