ఐసిస్, తాలిబన్లపై పోరాటానికి మహిళలు సిద్ధం, 25మందిని చంపి..
తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో ఆప్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. అలాంటి ఉగ్రవాదులతో పోరాడేందుకు ఆప్ఘనిస్తాన్ మహిళలు ముందుకు వస్తున్నారు.
కాబూల్: తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో ఆప్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. అలాంటి ఉగ్రవాదులతో పోరాడేందుకు ఆప్ఘనిస్తాన్ మహిళలు ముందుకు వస్తున్నారు. తాలిబన్ల వల్ల గతంలో ఆప్ఘాన్ ఎంతో నష్టపోయింది.
ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా ఉగ్రవాద ముప్పు తప్పడం లేదు. ఉగ్రవాద దాడులతో ప్రజలు విసిగిపోయారు. దీంతో దేశంలోని ఉత్తరాదిన ఉన్న జవ్ జ్ఞాన్ ప్రావిన్సులో తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదుల పైన పోరాడేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు.
ఉగ్రవాదుల పైన పోరాటంలో భాగంగా మహిళలు ఆయుధాలను చేతపట్టారు. అత్యాధునిక రైఫిల్స్తో శిక్షణ పొందారు. ఆయుధాలు చేతపట్టి మహిళలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. మహిళలు ఉగ్రవాదులపై పోరాడటాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా మద్దతు ఇస్తున్నారు.
తాలిబన్ల స్వాధీనం కాకుండా తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు జర్మీనా అనే మహిళా కమాండర్ సారథ్యంలో మహిళలు పోరాడుతున్నారు. దాదాపు 45 మంది మహిళా ఫైటర్లు పని చేస్తున్నారు. ఉగ్రవాద దాడుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలు వారిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. 2014లో ఓ ఆఫ్ఘన్ మహిళ తన కొడుకు హత్యకు ప్రతీకారంగా ఇరవై అయిదు మంది తాలిబన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది.