28 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో ఓ అబ్బాయి పుట్టాడు
పైడ్మాంట్: స్మార్ట్ సిటీలకు కొన్ని వేల మైళ్లు దూరంలోని ఓ పర్వత ప్రాంతంలో ఉన్న ఓ మారుమాల పట్టణం. ఆ పట్టణంలో 28 ఏళ్ల తర్వాత ఓ శిశువు జన్మించింది. అదేంటీ ఇప్పటి వరకు ఆ ఊర్లో పిల్లలే పట్టలేదా అంటే అవుననే చెప్పాలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఇటలీలోని పైడ్మాంట్ పర్వత ప్రాంతంలోని ఒస్తానా పట్టణం సంగతి ఇది.
వివరాల్లోకి వెళితే, ఒస్తానాలో గత వారం జోస్, సిల్వియా దంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఆ చిన్నారి పేరు పబ్లిటో. పబ్లిటో రాకతో తమ ప్రాంతంలో ఓ శిశువ జన్మించాడని, జనాభా పెరుగుదలకు తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం కలిగిందని మేయర్ గియాకోమో లంబార్డో తెలిపారు.
ఇటలీలోని ప్రధాన నగరాలకు దూరంగా ఉండటంతో ఒస్తానా పట్టణంలోని జనమంతా వలసల బాట పట్టారు. దీంతో పట్టణంలో యువతరమే లేకుండా పోయింది. దీంతో చిన్నపిల్లలే పుట్టడానికి ఆస్కారం లేకుండా పోయింది. అసలు జనాభా ఇంతగా తగ్గడానికి ఓ ప్రధాన కారణం ఉంది.
1900ల వరకు ఒస్తానా ప్రాంతం అన్ని పట్టణాల్లాగే ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. ఆ సమయంలో శిశువుల సంఖ్య 1000 మంది వరకు ఉండేది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది 700లకు తగ్గింది. అంతేగాక, రోమ్, వెనిస్లాంటి ప్రాంతాలకు వేల మైళ్ల దూరంలో ఉండటంతో అభివృద్ధి కూడా నామమాత్రంగా ఉండేది.
దీంతో ఒస్తానా పట్టణ ప్రజలు ఉపాధి కోసం వలసల బాట పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1980లో ఒకానొక సమయంలో కేవలం ఐదుగురు మాత్రమే శాశ్వత పౌరులు ఉండేవారు. దీంతో జనాభాను పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేపట్టాయి. అక్కడున్న వారికి ఉపాధని కల్పించాయి.
1987లో అక్కడ చివరిసారిగా ఓ శిశువు జన్మించాడు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత పబ్లిటో పుట్టడంతో ఆ ప్రాంతంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం ఒస్తానా పట్టణ జనాభా సంఖ్య 85 మంది. ఈ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించి, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు గాను అక్కడ రెండు రెస్టారెంట్లు, ఓ బార్ను ఏర్పాటు చేశారు.