మళ్లీ విషం చిమ్మిన చైనా: డోక్లాం వివాదంలో భారత్ను బద్నాం చేసే కథనం (వీడియో)
భారతే తమ భూభాగంలోకి చొచ్చుకువస్తుందంటూ నిరాధార ఆరోపణలు చేసింది.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య నెలకొన్న డోక్లాం వివాదాన్ని చైనా మీడియా సాగదీస్తూనే ఉంది. తప్పంతా భారత్ వైపే ఉందని వ్యంగ్య కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పటికే సెవెన్ సిన్స్ ఆఫ్ ఇండియా పేరుతో భారత్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించిన చైనా.. మరోసారి భారత్ను బద్నాం చేసే ఆరోపణలు చేసింది.
చైనాకు బెదరం, త్వరలో మోడీ, జిన్పింగ్ల భేటీ?
చైనా అధికారిక మీడియా జిన్హుహా డోక్లాం వివాదానికి భారతే కారణమంటూ తాజాగా కథనాన్ని ప్రసారం చేసింది. ఓవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత గల దేశమని, అద్భుతమైన సంస్కృతి భారత్ సొంతమని వ్యాఖ్యానిస్తూనే డోక్లాం వివాదంపై మాత్రం మరోసారి విషం చిమ్మింది.
టాక్ ఆఫ్ ఇండియా:
టాక్ ఆఫ్ ఇండియా పేరుతో డోక్లాం వివాదంపై చైనా మీడియా వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా మొన్నీమధ్యే జాతి వివక్షపూరిత వైఖరిని ప్రదర్శించేలా సెవెన్ సిన్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో ఓ చైనా యాక్టర్ గడ్డం, మీసాలు అతికించుకుని సిక్కు వ్యక్తిలా కనిపిస్తూ.. భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
మళ్లీ అదే కథ:
తాజాగా ప్రసారమైన టాక్ ఆఫ్ ఇండియా ఎపిసోడ్ లోను చైనా మీడియా వైఖరి మారలేదు. అయితే ఈసారి వ్యంగ్యాన్ని పక్కనపెట్టి సూటిగానే భారత్ పై ఆరోపణలు చేసింది. డోక్లాం వివాదంలోకి ప్రవేశించాల్సిన అవసరం భారత్ కు లేదని స్పష్టం చేసింది. భారతే అనవసరంగా డోక్లాంలో జోక్యం చేసుకుంటుందని ఆరోపించింది.
చైనా తప్పు లేదని:
డోక్లాం సరిహద్దులో చైనా తప్పేమి లేదని, వారేమి భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్లలేదని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో భూటాన్ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు భారత్ మాత్రం భూటాన్ విన్నపం మేరకే ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెబుతూనే ఉంది. అదీగాక చైనాను ఇలాగే వదిలేస్తే.. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను కబళించేందుకే ఆ దేశం ఏమాత్రం వెనుకాడదన్నది భారత్ చర్యలకు కారణంగా కనిపిస్తోంది.
ఎప్పుడు ఏం జరుగుతుందో?:
ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ చైనా బలగాలు భారత్ భూభాగంలోకి చొచ్చుకురావడం తీవ్ర కలవరం రేపింది. ఇరువైపులా దాదాపు 60 మంది జవాన్లు ఘర్షణ పడినట్లు ఓ వీడియో లీకైంది.దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణ.. ఆ తర్వాత సద్దుమణిగినప్పటికీ ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ యోచిస్తోంది.