బ్రెగ్జిట్ ఓటింగ్లో ప్రధాని థెరిసా మేకు షాక్... అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు
బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బ్రెగ్జిట్పై ఆదేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో ఆమె ఓటమి చవిచూశారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది విపక్ష లేబర్ పార్టీ. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదేశ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో బ్రెగిట్కు వ్యతిరేకంగా 432 మంది ఓటేయగా... 202 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రెగ్జిట్కు అనుకూలంగా వేయాలని తమ అభ్యర్థులను థెరిసా మే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె విన్నపాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఈ ఓటింగ్ ద్వారా స్పష్టమైంది.
బ్రెగ్జిట్ అంశంలో ఓటమి చవిచూసిన థెరిసామే బుధవారం ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనుంది. అయితే అవిశ్వాస తీర్మానంలో తాను గట్టెక్కుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు చెప్పారు. బ్రెగ్జిట్ పై పార్లమెంటులో ఓటింగ్ నిర్వహిస్తున్న సమయంలో పారిశ్రామిక వేత్తలు, ఇతర వ్యాపారులు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతతో వెస్ట్మిన్స్టర్ వైపు చూశారు.
ఇదిలా ఉంటే బ్రెగ్జిట్పై జరిగిన ఓటింగ్లో ఓటమి చవివచూసిన తర్వాత ప్రధాని థెరిసామే ఎక్కువ సమయం తన కార్యాలయంలో గడిపారు. అయితే బ్రెగ్జిట్కు తన సొంత పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలే వ్యతిరేకంగా ఓటు వేయడంతో షాక్కు గురయ్యారు థెరిసా మే. అయితే బుధవారం ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంలో మాత్రం వారంతా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారని స్పష్టం చేశారు. బ్రెగ్జిట్కు సంబంధించి థెరిసా మే కొత్త ప్రతిపాదనలు పార్లమెంటులో ప్రవేశపెడతారని విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీలు అవిశ్వాస పరీక్ష సందర్భంగా తామంతా థెరిసా మే వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు.