బద్దలైన భారత సంతతి రైతు నిర్మించిన డ్యాం: 47మంది మృతి, భారీ వర్షాలకు 215మంది మృతి
నైరోబీ: కెన్యాలో కురుస్తున్న భారీ వర్షాలు వందలాది మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేశాయి. తాజా, భారీ వర్షాల కారణంగా ఓ ఆనకట్ట(డ్యాం) బద్దలై జల ప్రళయం సృష్టించింది. మహోగ్రంగా దూసుకొచ్చిన నీటి ప్రవాహం పరిసరాల్లోని వందల ఇళ్లను అమాంతం ఊడ్చుకెళ్లింది.దీంతో 47 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 20 మంది పిల్లలున్నారు.
వరుస కరవుల తర్వాత ఇక్కడ వారాల తరబడి కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు బురద మయం అవుతున్నాయి. ఫలితంగా ఇప్పటివరకూ 215 మంది మరణించారు.
తాజాగా బుధవారం బద్దలైన ఆనకట్ట పేరు 'ద ప్రైవేట్ పటేల్ డామ్'. ప్రజలు, రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు భారత సంతతికి చెందిన మన్సుకుల్ పటేల్ అనే ఓ రైతు ఈ డ్యాంను నకురు పట్టణంలోని సొలాయ్ ప్రాంతంలో నిర్మించారు. ఈ డ్యాంతోపాటు మరికొన్ని డ్యాంలను కూడా ఆయన సొంతంగా నిర్మించారు.
కాగా, భారీ వర్షాలు, వరద ఉద్ధృతికి దాదాపు ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. రెండు కి.మీ. పరిధిలో ఒక్క ఇంటినీ వదలలేదు. ఓ కాఫీ తోటలో 11 మృతదేహాలు బురదలో కూరుకుపోయి కనిపించడం హృదయాలను కదిలిస్తోంది. వీరంతా ఇళ్ల నుంచి పరుగులు తీసి ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే వరద ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో తప్పించుకోలేకపోయారు. బాధితుల్లో చాలా మంది పిల్లలు, వృద్ధులే ఉన్నారు. వేగంగా పరుగెత్తలేకపోవడం వల్లే వీరంతా వరదకు బలై ఉండొచ్చని ప్రాంతీయ పోలీసు విభాగం అధిపతి గిడెన్ కిబుంజా తెలిపారు. దాదాపు 500 కుటుంబాలు ఈ ప్రమాదానికి ప్రభావితమై ఉండొచ్చని కెన్యా రెడ్ క్రాస్ అంచనా వేసింది.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నైరోబిలోని ఓ డ్యాం పగలడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరి కొన్ని డ్యాంలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని తమను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.