విమానం ఇంజిన్లలోకి పక్షులు..ఎమర్జెన్సీ ల్యాండింగ్కు కోరిన పైలట్, 23 మందికి గాయాలు
మాస్కో : ఈ మధ్యకాలంలో విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. భూమిపై ఉన్నప్పుడు తలెత్తితే సమస్యను వెంటనే పరిష్కరించొచ్చు. కానీ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తాజాగా రష్యాలో ఓ విమానం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. మాస్కోలో టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే విమానంలోని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం గ్రౌండ్ సిబ్బందికి సమాచారం పంపించారు.
ఉరాల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ బస్ 321లో 233 మంది ప్రయాణికులు ఉన్నారు. మాస్కోలో టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే ఓ పక్షుల సమూహంను విమానం ఢీకొట్టింది. ఇది గమనించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం గ్రౌండ్ సిబ్బందిని అడిగారు. దీంతో జుకోవ్స్కీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంను ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికుల్లో 23 మందికి గాయాలైనట్లు సమాచారం. విమానంలోని రెండు ఇంజిన్లోకి పక్షులు చిక్కుకోవడంతో ఇంజిన్లు ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం కూడా మనదేశంలోని నాగ్పూర్లో ఇండిగో ఎయిర్లైన్స్ విమానం మొరాయించింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం మొరాయించింది. ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. విమానంలో గడ్కరీతో పాటు మరో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ చేసేందుకు రెండో సారి కూడా పైలట్ ప్రయత్నించారు. అయితే అప్పటికీ విమానం గాల్లోకి ఎగరకపోవడంతో ప్రయాణికులందరిని మరో విమానంలో ఢిల్లీకి తరలించారు.