మేమూ తగ్గం : పాక్కు 48 మిలటరీ డ్రోన్లను విక్రయించనున్న చైనా
చర్యకు ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ సిద్ధాంతం అందరం చదివే ఉంటాం. అయితే అది వ్యక్తులకు కూడా ఆపాదించొచ్చు. తాజాగా రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థ భారత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జిరగి ఇంకా వారంరోజులైనా గడవకముందే వెంటనే రియాక్షన్ పాకిస్తాన్ చైనాల నుంచి వచ్చింది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ బలోపేతానికి 48 అత్యాధునిక మిలటరీ డ్రోన్లను విక్రయించేందుకు చైనా ముందుకొచ్చింది. ఈమేరకు బీజింగ్ ఒక ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ డ్రోన్ల కొనుగోలు కోసం ఎంత ఖర్చు చేస్తుందో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. చైనా కూడా ధరపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
డ్రోన్లను తయారు చేయనున్న చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ సంస్థ
చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ సంస్థ వింగ్లూంగ్-II డ్రోన్లను తయారు చేస్తోంది. ఇవి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్నాయి. శతృవును టార్గెట్ చేయగలా సత్తా వీటికి ఉంటుంది. ఈ డ్రోన్లను సంయుక్తంగా తయారు చేస్తున్నారు. ఆయుధాలు సప్లై చేయడంలో పాకిస్తాన్కు చైనా అతిపెద్ద భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇప్పటికే ఇరుదేశాలు జేఎఫ్ థండర్ ఎయిర్ క్రాఫ్ట్ను సంయుక్తంగా తయారుచేస్తున్నాయి.
భారత్ రష్యానుంచి ఎస్ -400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం కుదుర్చకోగానే పాకిస్తాన్ కూడా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చైనా నుంచి మానవరహిత విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. చైనా నుంచి మానవరహిత విమానాల కొనుగోలు చేస్తున్నట్లు పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ షెర్డిల్స్ ఏరోబేటిక్ టీమ్ తమ అధికారిక ఫేస్బుక్ పై పోస్టు చేసినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే పాకిస్తాన్ చైనా నుంచి ఎంతకు కొనుగోలు చేస్తుందో అన్న విషయం స్పష్టం చేయలేదు. అంతేకాదు విమానం ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ గ్రూపు కూడా ఒప్పందంపై క్లారిటీ ఇవ్వలేదు.
వింగ్ లూంగ్-IIకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ
వింగ్ లూంగ్-II మానవరహిత యుద్ధ విమానం గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా గగనతలంలోకి ఎగిరింది. ఇప్పటికే వింగ్ లూంగ్-II మానవరహిత విమానాలు కావాలంటూ పలు దేశాలు చైనాను ఆశ్రయించినట్లు ఆ దేశ పత్రిక క్జిన్హూవా పేర్కొంది. అది ఇంకా తయారీ దశలో ఉన్న సమయంలోనే విమానాల కొనుగోలుకు పలుదేశాలు ముందుకొచ్చినట్లు పత్రిక తెలిపింది. అయితే ఏ దేశాలు కొనుగోలు చేసేందుకు వచ్చాయో అనేదాని గురించి సమాచారం బయటపెట్టలేదు.
ఇక తొలి మానవ రహిత విమానం గాల్లోకి ఎగరగానే 10 నెలల సమయంలో పలు రకాల పరీక్షలు లేదా ప్రయోగాలు ఈ విమానాలపై చేశారు. ముఖ్యంగా ఫైరింగ్ ప్రయోగాన్ని పరీక్షించి ఈ మానవరహిత విమానం ఎంతమేరకు తట్టుకోగలదో అనేదానిపై ఒక స్పష్టతకొచ్చారు. దీనికనుగుణంగా కస్టమర్ ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో తెలుసుకుని విమానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో స్థిరమైన లక్ష్యాలను చేధించడం, ప్రయాణిస్తున్న లక్ష్యాలను చేధించడం, సమయానికి తగ్గట్టుగా లక్ష్యాలను చేధించడం, భూమిపై ఉన్న స్టేషన్తో సమన్వయం చేసుకోవడంలాంటి అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. దాదాపు 48 వింగ్ లూంగ్-II మానవరహిత విమానాలు పాకిస్తాన్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.
అమెరికా డ్రోన్లకు ఏమాత్రం తీసిపోని వింగ్లూంగ్ -II
పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం నిజమేనని పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసమే ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోందని మిలటరీ నిపుణులు సాంగ్ జాంగ్పింగ్ తెలిపారు. అమెరికా డ్రోన్లు MQ-1ప్రిడేటర్, MQ-9రీపర్లు సాంకేతికంగా చాలా అడ్వాన్స్గా ఉన్నాయని అయితే అమెరికా వాటి దిగుమతిపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. ఇందుకోసమే అంతర్జాతీయ మార్కెట్లో చైనా డ్రోన్లకు గిరాకీ ఏర్పడిందని అమెరికా డ్రోన్లతో సమానంగా పనిచేయడంతో పాటు తక్కువ ధరకే వస్తున్నాయని ఆయన తెలిపారు.