మరో షాక్: ఎంహెచ్17పై సరదా వ్యాఖ్య ఇలా, లవర్తో..
కౌలాలంపూర్: మలేషియాకు ఎయిర్ లైన్స్కు షాక్! ఐదు నెలల్లోనే రెండు విమానాలు ప్రమాదానికి గురి కావడం మలేషియా ఎయిర్ లైన్స్ జీర్ణించుకోలేకపోతోంది. మార్చి నెలలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. దాని జాడ ఇప్పటికీ లభించలేదు. అంతలోనే మరో బెయింగ్ 777 విమానం ఎంహెచ్ 17 విమానం ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో పదిహేను మంది క్రూ మెంబర్స్ సహా 298 మంది మృతి చెందారు.
ఎంహెచ్ 17 మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎంహెచ్ 370 కుటుంబ సభ్యులు, బంధువులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఎంహెచ్ 370 ఆచూకీ లభించక ముందే మరో ప్రమాదం జరగటం పైన ఎంహెచ్ 370 బాధితులు ఎమోషనల్గా స్పందిస్తున్నారు. ఎంహెచ్ 17 ప్లేన్ క్రాష్ యాధృచ్చికం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, మలేషియా విమాన ప్రమాదంపై ఓ విమాన ప్రయాణికుడు చేసిన సరదా వ్యాఖ్య నిజమైపోయింది! సాంకేతిక విప్లవంతో ప్రతిదానినీ సామాజిక సైట్లలో పంచుకోవడం వ్యసనంగా మారింది. దీంతో కోర్ పాన్ అనే నెదర్లాండ్స్ దేశస్థుడు మలేసియా విమానం ఎక్కడానికి కొద్ది సేపటికి ముందు 'విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే... చెప్పుకోవడానికి... ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది' అంటూ ఎంహెచ్ 17 ఫోటోలు తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
దీనిపై అతని మిత్రులు సరదా కామెంట్లు కూడా చేస్తూ క్షేమంగా గమ్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు అతను గమ్యం చేరుకోకముందే అనంతవాయువుల్లో కలిసిపోయాడు. కాగా, కోర్ పాన్ తో పాటు అతని ప్రేయసి నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉండి అసువులు బాసింది.