మోడీ! మీ ఎన్నికల గోలలోకి మమ్మల్ని లాగకండి: గుజరాత్ ఎన్నికలపై పాకిస్తాన్ కౌంటర్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ సీఎం కావాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అందుకోసం తనవంతు సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పాక్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు. భారత్లో జరుగుతోన్న ఎన్నికల అంశంలోకి తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.
తన సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్ను లాగడాన్ని భారత్ మానుకోవాలని, కుట్ర ఆరోపణలను కల్పించి చెప్పే బదులు, సొంత బలంతో మోడీ గెలిచే ప్రయత్నం చేయాలని, ఆయన బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Recommended Video
కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్తాన్ ప్రతినిధులతో ఇటీవల సమావేశమయ్యారని, వారితో చర్చించారని, తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. తన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ మాజీ ఆర్మీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్, అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, దీనిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా గట్టిగానే బదులిచ్చింది. రెండేళ్ల క్రితం అనూహ్యంగా పాకిస్తాన్లో దిగి అప్పటి ప్రధాని ఇంటికి వెళ్లి విందు చేసి వచ్చింది మోడీయేనని, ఆయనలా పిలవని పెళ్లికి ఎందుకు వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.