'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానం
ఇస్లామాబాద్: మలాలా యూసఫ్ జాయ్ నోబెల్ బహుమతి దక్కించుకున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ తాలిబన్లు ఆమెకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించారు. ట్విట్టర్లో మలాలాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.. చేస్తున్నారు. మలాలాకు నోబెల్ శాంతి బహుమతి దక్కడంపై తాలిబన్ వేర్పాటువాద సంస్థ నిప్పులు చెరిగింది.
బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలపై తాలిబన్ ఉగ్రవాదులే హత్యాయత్నం చేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వేర్పాటువాదులు మలాలాకు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. దేవుడి పట్ల మతం పట్ల విశ్వాసం లేనివారికి ఏజెంటుగా వ్యవహరిస్తున్నందుకే ఆమెకీ అవార్డు ఇచ్చారని పాక్ తాలిబన్ నుంచి ఇటీవలే వేరుపడిన తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) నేత జమాత్ ఉల్ అహ్రార్ విమర్శించారు.
టీటీపీ అధికారిక వెబ్సైట్లో మలాలాపై ధ్వజమెత్తారు. అలాగే నోబెల్ అవార్డు వ్యవస్థాపకుడి పైనే విమర్శలు చేశారు. విశ్వాసఘాతుకులకు మలాలను ప్రచార సాధనంగా ఉపయోగించుకునేందుకు ఈ అవార్డు ఇచ్చారని టీటీపీ ఆరోపించింది. తుపాకీలు, ఆయుధాలకు ఎదురొడ్డి ఆమె పోరాడుతోందని చెప్పడాన్ని అహర్రార్ తప్పుపట్టారు.
నోబెల్ అవార్డు స్థాపించిన వ్యక్తే పేలుడు పదార్థలను కనుగొన్నాడన్న సంగతి మలాలకు తెలియదని టీటీపీ అధికార ప్రతినిధి యెహ్సానుల్లా ఎహాసన్ పేర్కొన్నారు. పాక్లోని ఉగ్రవాద సంస్థలు మలాలా తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఈ సంవత్సరం పాక్ తాలిబన్ల నుంచి వేరుపడిన జమాత్ ఉల్ అహ్రార్ అనే సంస్థ మలాలా ఇస్లాం వ్యతిరేకుల చేతిలో ఏజెంట్గా మారిందని విమర్శించింది.
మరోవైపు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన మలాలకు కెనడా అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు కెనడా గౌరవ పౌరసత్వం ఇవ్వడంతో పాటు తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని స్టెఫెన్ హార్పర్ ఆహ్వానించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఆమెకు కెనడా గౌరవ పౌరసత్వం ఇచ్చారు. తాజాగా మలాలకు నోబెల్ బహుమతి దక్కడంతో ఆ హోదాలో ఈ నెల 22న కెనడాలో పర్యటించనుంది.
బాలల హక్కుల కోసం మలాల, సత్యర్థి చేస్తున్న కృషికి సరైన గౌరవం దక్కిందని, నోబెల్ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా వారి సేవలను ప్రపంచ గుర్తించినట్టయిందని, కెనడా దేశ ప్రజల తరఫున వారికి నేను అభినందనలు తెలుపుతున్నానని హార్పర్ స్పష్టం చేశారు. కాగా కెనడా గౌరవ పౌరసత్వం దక్కించుకున్నవారిలో మలాల ఆరోవ్యక్తి. దలైలామా, నెల్సన్ మండేలా, ఆంగ్సాన్ సూకీలకు ఈ గౌరవం దక్కింది.
ఇదిలా ఉండగా.. కైలాస్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించడంపై చైనా మీడియా పలు సందేహాలు వ్యక్తం చేసింది. మలాలకు అవార్డు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సత్యర్థి, మలాలకు అవార్డుల ప్రకటన వార్తలను చైనా మీడియా ప్రాధాన్యత ఇచ్చింది. షాంఘై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ స్టడీస్ డైరెక్టర్ జహావో గంచెంగ్ మాట్లాడుతూ ప్రపంచ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు అవార్డు ఇచ్చినట్టు భావించినా, దీనిలో రాజకీయపరమైన ప్రయోజనాలు ఉన్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు.
ఆఫ్గనిస్తాన్ నుంచి యుఎస్ సంకీర్ణదళాలు ఉపసంహకరణ నేపథ్యంలో ఆమెకు అవార్డు ఇచ్చి ప్రచారానికి వాడుకునే అవకాశం ఉందని ప్రభుత్వం మీడియా గ్లోబల్ టైమ్స్తో అన్నారు. పాకిస్తాన్లో మెడికల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వేలాది పేదలు, అనాధలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న అబ్దుల్ సత్తార్ వంటి సామాజిక కార్యకర్తలు నోబెల్ నిర్వాహకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు.