నెక్స్ట్ టార్గెట్ దావూద్: రాజన్ వద్ద సమాచారం ఉందా?
ముంబై: గ్యాంగ్స్టర్ చోటా రాజన్ అరెస్టుతో చాలా కేసుల్లో మిస్టరీ తొలగిపోతుందని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా చోటా రాజన్ అరెస్టు అనంతరం.. తదుపరి లక్ష్యం దావూద్ ఇబ్రహీం అనే వార్తలు వస్తున్నాయి. రాజన్ వద్ద దావూద్ గురించిన సమాచారం ఏమైనా ఉండి ఉంటుందా అనే చర్చ సాగుతోంది.
ముఖ్యమంగా మాఫియా చేతిలో హతమైన మిడ్ డే పత్రిక జర్నలిస్ట్ జేడే హత్య కేసుతో పాటు అనేక నేర, ఉగ్రవాద కేసుల్లో చోటా రాజన్ నుంచి కీలక ఆధారాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో దావూద్ గురించి లేదా అండర్ వరల్డ్ మాఫియా గురించి ఛోటా రాజన్ వద్ద సమాచారం ఉండకపోవచ్చునని కూడా భావిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాఫియా ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా చోటా రాజన్ ఉన్నాడు. తాను ఎక్కడున్నది బయటపడకుండా వివోఐపీని వాడుతూ ప్రొక్సీ ఐడీలో వాట్సప్లో మాత్రమే ఫోన్ కాల్స్ చేసేవాడు.
ఈ నేపథ్యంలో అనారోగ్యం, ప్రత్యర్థి చోటా షకీల్ నుంచి ముప్పు నేపథ్యంలో చోటా రాజన్ తిరిగి భారత్ వచ్చేందుకు తానే స్వయంగా ముందుకొచ్చి అరెస్టయి ఉంటాడనే వాదనలు కూడా ఉన్నాయి. 1998లోనే థాయ్లాండులో చోటా రాజన్ పట్టుబడ్డాడు. నకిలీ పాసుపోర్టుతో ప్రయాణిస్తున్న అతడిని అరెస్టైన మరుసటిరోజు విడుదల చేశారు.
అప్పట్లో థాయ్లాండ్ నుంచి భారత్ తీసుకు వచ్చేందుకు కేంద్రం హోంమంత్రిత్వశాఖ, భద్రతా సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందుకు అప్పట్లో మాఫియా దావూద్ ఇబ్రహీంను ఎదుర్కొనేందుకు కేంద్ర నిఘా సంస్థలు చోటా రాజన్ను ఆయుధంగా వాడుకున్నాయి.
1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీంకు దూరంగా జరిగిన చోటా రాజన్... తనను తాను దేశభక్త హిందూ డాన్గా అభివర్ణించుకున్నాడు. రీసెర్చ్ అనాసిస్ వింగ్ (రా), ఐబీలు రాజన్ను దావూద్ ఇబ్రహీంకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయి.
కాగా, దావూద్ ఇబ్రహీంను భారత్ రప్పించడం కష్టమే కాని అసాధ్యం కాదంటున్నారు. దావూద్కు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో గట్టి కాంటాక్ట్స్ ఉన్నాయి. 1994లోనే దావూద్ ఇబ్రహీంను రప్పించు మంచి అవకాశం కోల్పోయాం.