భారత్ పై ఒత్తిడికి చైనా మరో వ్యూహం- తెరపైకి భూటాన్ భూభాగం -పొరుగుదేశం దీటైన జవాబు..
వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై దాడి తర్వాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న దాన్నుంచి బయటపడేందుకు రోజుకో వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగా భారత్ పొరుగున ఉన్న దేశాలను రెచ్చగొట్టడం ద్వారా వారిని దూరం చేయాలనే వ్యూహానికి పదునుపెడుతోంది. తాజాగా భారత్ మిత్రదేశం భూటాన్ తో తమకు సరిహద్దు వివాదాలు ఉన్నాయనే అంశాన్ని డ్రాగన్ దేశం తెరపైకి తెచ్చింది. తద్వారా భారత్ పై ఒత్తిడి పెంచవచ్చని భావిస్తోంది.
Recommended Video
భారత్-చైనా సరిహద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?
ముప్పేట దాడితో డ్రాగన్ కు ముచ్చెమటలు..
గల్వాన్ దాడితో భారత్ ను దెబ్బతీశామన్న సంతోషం చైనాకు ఎంతో కాలం మిగలలేదు. ఆ తర్వాత అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలు తట్టుకుంటూనే దౌత్య మార్గాల్లో పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వీలుపడటం లేదు. అమెరికాను కాదని చైనాకు మద్దతిచ్చేందుకు కీలక దేశాలేవీ ముందుకు రాకపోవడంతో డ్రాగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. గల్వాన్ దాడితో భారత్ ను కవ్వించాలన్న ప్రయత్నం చేసి విఫలమైన చైనా ముప్పేట దాడితో ఉక్కిరికిబిక్కిరవుతోంది. దీంతో రోజుకో వ్యూహంతో భారత్ పై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
భూటాన్ భూభాగంపై కన్ను...
చైనా పొరుగున ఉన్న భారత్ మిత్రదేశం భూటాన్ విషయంలో తలదూర్చి గతంలో డోక్లాంలో ఎదురుదెబ్బలు తిన్న చైనా మరోసారి సరిహద్దు వివాదాలను తెరపైకి తెచ్చింది. భూటాన్ తో సరిహద్దుల పునర్ వ్యవస్దీకరణ జరగాల్సి ఉందని, ఆ దేశంతో ఉన్న తూర్పు, మధ్య, పశ్చిమ సరిహద్దులు వివాదాస్పదమే అంటూ చైనా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అంతే కాదు భూటాన్ తమ దేశంలోని తూర్పున ఉన్న సాక్టేంగ్ వన్యప్రాణి కేంద్రానికి గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ (GEF) నుంచి నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగిలింది. వన్యప్రాణి కేంద్రం ఉన్న భూభాగం వివాదాస్పదమైందని, దానికి నిధులు ఎలా ఇస్తారని చైనా విదేశాంగశాఖ ప్రశ్నిస్త్తోంది. వీటన్నింటి అసలు లక్ష్యం భారత్ పై ఒత్తిడి పెంచడమే.
దీటుగా జవాబిస్తున్న భూటాన్....
తూర్పు భూటాన్ లోని సాక్టేంగ్ వన్యప్రాణి కేంద్రం తమ భూభూగంలో ఉందంటూ చైనా లేవనెత్తిన అభ్యంతరాలకు భూటాన్ దీటుగా జవాబిస్తోంది. సాక్టేంగ్ వన్యప్రాణి కేంద్రం పూర్తిగా తమ భూభూగంలోనే ఉందని చెబుతూ వాటికి నిధులను కూడా రప్పించుకుంది. అంతే కాదు చైనా తమ దేశంలోని తూర్పు భూభాగంపై అభ్యంతరాలు లేవనెత్తడం తొలిసారి అంటూ డ్రాగన్ దేశం వైఖరిని అంతర్జాతీయంగా ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. తద్వారా చైనా వాదనను తాము పట్టించుకోమని తేల్చిచెప్పింది. గతంలో భూటాన్ పరిధిలోకి వచ్చే డోక్లాంను ఆక్రమించేందుకు చైనీస్ ఆర్మీ చేసిన ప్రయత్నాలను 72 రోజుల పాటు తీవ్రంగా ప్రతిఘటించి దురాక్రమణ కాకుండా భారత్ అడ్డుకుంది.