ఆఫ్గనిస్తాన్ లైబ్రరీ: ప్రధాని మోడీపై ట్రంప్ విమర్శలు, గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఆఫ్గనిస్తాన్లో భారత్ ఎలాంటి ప్రయోజనం చేకూరని గ్రంథాలయం ఏర్పాటు కోసం నిధులు సమకూర్చిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఆఫ్గనిస్తాన్ను నిర్మించేందుకు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
ఈ గ్రంథాలయం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ట్రంప్ తన కేబినెట్ సహచరులతో నిర్వహించిన సమావేశంలో ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందులో భాగంగా గ్రంథాలయం ఏర్పాటు
భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సమయంలో ఆఫ్గనిస్తాన్లో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారని, అందుకు కృతజ్ఞతలు తెలిపామని, కానీ భారత్ నిర్మించే గ్రంథాలయంతో కలిగే ప్రయోజనం ఏమిటని, ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలియదన్నారు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ... ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లతో పోరాడేందుకు భారత్ సహా రష్యా, పాకిస్థాన్ వంటి దేశాలు సహకరించాలన్నారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాలన్నారు.
ఈ రంగాల్లో తోడ్పాడు
ఆఫ్గనిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని 2017లో భారత్, అఫ్గనిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. 31 ప్రావిన్స్లలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇరిగేషన్, తాగునీరు ఇతర రంగాల అభివృద్ధికి సాయం చేస్తామని భారత్ పేర్కొంది. ఇందులో భాగంగానే అక్కడి యువత కోసం గ్రంథాలయం ఏర్పాటు చేసింది. దీనిపై ట్రంప్ విమర్శలు చేశారు.
ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
ఈ విమర్శలపై భారత్ కూడా ధీటుగానే స్పందించింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. ఆఫ్గనిస్తాన్ పునర్నిర్మాణం కోసం భారత్ ఎంతగానో కృషి చేస్తోందని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, కానీ అక్కడ 218 కి.మీ. పొడవైన రహదారి నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తోందని, దీంతో పాటు సల్మా డ్యాం, అఫ్గాన్ కొత్త పార్లమెంటు భవనం కోసం కూడా భారత్ పెట్టుబడులు పెడుతోందని, ఆ దేశ సైన్యానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని అందిస్తోందని, వందలాది మంది అఫ్గాన్ భధ్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తోందని తెలిపారు.