బ్రిటన్ తరువాత..లాక్డౌన్లోకి వెళ్లిన మరో దేశం: లిస్ట్లో మరిన్ని: కుప్పలుగా కొత్త కేసులు
బెర్లిన్: సాధారణ కరోనా కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చిన తరువాత.. బ్రిటన్ లాక్డౌన్ వెళ్లింది. కొత్త వేరియంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. ఫిబ్రవరి రెండో వారం వరకు లాక్డౌన్, ఇతర ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే.. మరో దేశంలో లాక్డౌన్లోకి వెళ్లింది.
ఇక జర్మనీలో..
తాజాగా జర్మనీలో లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఛాన్స్లర్ ఏంజెలా మోర్కెల్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తప్పనిసరిగా లాక్డౌన్ను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో విధించిన లాక్డౌన్ కంటే.. ఈ సారి మరింత కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. పౌరులెవరూ ఇళ్లను దాటి బయటికి రావొద్దని విజ్ఙప్తి చేశారు.
15 చదరపు కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఒక్కరికి మాత్రమే అనుమతి..
అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంలో ఒకరికి మాత్రమే బయటికి రావడానికి అనుమతి ఇచ్చింది. ఇంటి నుంచి 15 చదరపు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే వెసలుబాటును కల్పించింది. దీనికి సరైన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల విక్రయాలతో సంబంధం లేని షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పార్కులు, విద్యాసంస్థలను మూసివేశారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జర్మనీ ప్రభుత్వం ఇదివరకే పాక్షికంగా లాక్డౌన్ను ప్రకటించింది.
పాక్షిక లాక్డౌన్ ఇక పూర్తిగా
కిందటి నెల 16వ తేదీన ప్రకటించిన ఈ పాక్షిక లాక్డౌన్ ఈ నెల 10వ తేదీతో ముగియబోతోంది. దీన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు ఏంజెలా మోర్కెల్ తెలిపారు. ఇదివరకు అమల్లో ఉన్నప్పటి కంటే లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. బయటి దేశాల నుంచి వచ్చిన వారికి అయిదు రోజుల పాటు క్వారంటైన్ను జర్మనీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారు. నెగెటివ్ వచ్చినా సరే.. క్వారంటైర్కు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
36 వేలకు పైగా మరణాలు..
అయిదు రోజుల పాటు క్వారంటైన్లో రెండోసారి నెగెటివ్ రిపోర్ట్ వస్తేనే బయటికి పంపిస్తారు. జర్మనీలో ప్రస్తుతం 18,14,565 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 36,510 మంది మరణించారు. 14,24,700 మంది రికవరీ అయ్యారు. మంగళవారం ఒక్కరోజే 944 మరణాలు నమోదు అయ్యాయి.
ఈ పరిస్థితిని అధిగమించడానికి లాక్డౌన్ విధించడం మినహా మరో మార్గం లేదని ఏంజెలా మోర్కెల్ తెలిపారు. దేశ ప్రజలు సహకరించాలని కోరారు. కాగా- మరిన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలెండ్, దక్షిణాఫ్రికా వంటి స్ట్రెయిన్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో లాక్డౌన్ విధిస్తారని తెలుస్తోంది.