ఏమిటీ దుస్సాహసం: 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో రష్యా జోక్యం..?
వాషింగ్టన్: 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే తేల్చేశాయి. తాజాగా రష్యా కన్ను భారత్తో పాటు బ్రెజిల్ ఎన్నికలపై కూడా పడ్డట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సోషల్ మీడియా నిపుణులు అమెరికా ప్రజాప్రతినిధులకు తెలిపారు. ఇప్పుడు ఈ అంశం అంతర్జాతీయంగా పెద్ద చర్చకే తెరలేపుతోంది. రష్యా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లోకి తల దూర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పలు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో మీడియా వ్యవహరిస్తున్నట్లుగా ఆయా దేశాల్లో మీడియా కూడా వ్యవహరించాలని లేనిపక్షంలో పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఇంటర్నెట్ స్టడీస్ ప్రొఫెసర్ ఫిలిప్ హోవార్డ్ హెచ్చరించారు. అమెరికా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మరో కొన్ని నెలల్లో భారత్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రష్యా తలదూర్చే అవకాశం ఉందని హోవర్డ్ తెలిపారు. ఇందుకు రష్యా భారత మీడియానే ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. భారత్తో పాటు బ్రెజిల్ ఎన్నికలను కూడా రష్యా ప్రభావితం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తమవద్ద ఉందని హోవార్డ్ వెల్లడించారు.
"అమెరికా మిత్రదేశాలు ,ప్రజా స్వామ్య దేశాలనే రష్యా టార్గెట్గా చేసుకుంది. అదికూడా ఆయాదేశాల్లోని మీడియానే ఆయుధంగా మలుచుకుంది. ఇక అమెరికాను టార్గెట్ చేసే క్రమం నుంచి రష్యా తప్పుకుంది. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్ దేశాలే రష్యా టార్గెట్" అని హోవార్డ్ వివరించారు. రష్యా బారి నుంచి తప్పించుకునేందుకు ఆయాదేశాల్లోని మీడియా అప్రమత్తంగా ఉండాలని హోవార్డ్ సూచించారు. సోషల్ మీడియా వేదికగా విదేశీ ప్రభావం ఎంతమేరకు ఉంది అనే అంశంపై సెనేట్ కమిటీ చర్చ నిర్వహించింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్న అంశంపైనే ప్రధాన చర్చ సాగింది.