WhatsApp news: పరిమితి విధింపుతో ఆ వార్తలు తగ్గాయన్న స్టడీ
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ఈ మధ్య ఫార్వర్డ్ మెసేజ్లపై పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఫార్వర్డ్ మెసేజ్లతో సమాజంలో అనవసరమైన ఆందోళనలకు గురిచేస్తోందని గ్రహించిన వాట్సాప్ దీనిపై పరిమితి విధించింది. అంతకుముందు ఒక వినియోగదారుడు ఒకే మేసేజ్ను 256 గ్రూపులకు పంపే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం ఐదు గ్రూపులకు మాత్రమే పంపేలా పరిమితి విధించింది. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తోందని ఓ నివేదిక తన స్టడీ ద్వారా వెల్లడించింది.
ఎన్నికల సందర్భంగా ఆయుధంగా మారిన వాట్సాప్
కొన్ని సందేశాల్లో సరైన సమాచారం ఉండదు. అయితే అది ఉద్దేశ పూర్వకంగా పంపించిన మెసేజ్ కాదు. కొన్ని మెసేజ్లు మాత్రం కావాలనే తప్పుడు సమాచారంను ప్రచారం చేసే దిశగా ఉన్నాయి. ఇలాంటి మెసేజ్లతో ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువగా ప్రచారం అయ్యేవి. ముఖ్యంగా బ్రెజిల్ భారత్లో జరిగిన ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాట్సాప్ను చాలామంది వినియోగించారు. ఆ సమయంలో ఉన్నవీ లేనివీ ప్రచారం చేస్తూ సమాజంలో కొంత భయాన్ని సృష్టించారు.
80శాతం తప్పుడు వార్తలు బంద్
తాజాగా మిట్ యూనివర్శిటీలో పరిశోధకులు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లపై ఓ అధ్యయనం చేశారు. ఫార్వర్డ్ మెసేజ్లపై పరిమితి విధించిన తర్వాత చాలా వరకు తప్పుడు ప్రచారాలకు తెరపడిందని వారు వెల్లడించారు. ఇక ఫార్వర్డ్ మెసేజ్లపై పరిమితి విధించిన తర్వాత దాదాపు 80శాతం తప్పుడు వార్తల ప్రచారం కేవలం రెండురోజుల్లోనే తగ్గిపోయిందని పరిశోధకుల్లో ఒకరు కిరణ్ గరిమెల్ల తెలిపారు. మరో 20శాతం ఇంకా వైరల్గా ఉన్నాయని వెల్లడించారు.
బహిరంగ గ్రూపుల డేటా విశ్లేషణ
వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉండటం అది ప్రైవేట్ యాప్ కావడంతో పబ్లిక్ డేటాను స్టడీ చేశారు. ప్రైవేట్ చాటింగ్స్ను వారు పరిగణలోకి తీసుకోలేకపోయినప్పటికీ... బహిరంగ గ్రూపులలో మెంబర్స్గా చేరి ఆ డేటాను పరిశీలించారు. ముఖ్యంగా రాజకీయనాయకులు ఉండే గ్రూపుల్లో వారు ఓటర్స్తో సంబంధాలు కలిగి ఉన్న గ్రూపుల్లో సభ్యులుగా చేరారు. ఇలా బ్రెజిల్, భారత్, ఇండోనేషియాల్లోని వేల సంఖ్యలో ఉన్న గ్రూపుల్లో చేరి ఆ డేటాను సేకరించి స్టడీ చేశారు. అలా 6 మిలియన్ పబ్లిక్ మెసేజ్లను సేకరించి ఫిల్టర్ చేసి విశ్లేషించారు. ఫార్వర్డ్ మెసేజ్లు ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయనేదానిపై స్టడీ చేశారు.
25శాతం మేరా తగ్గిన ఫార్వర్డ్ మెసేజ్లు
ఫార్వర్డ్ మెసేజ్లపై పరిమితి విధించిన తర్వాత , మొత్తం ఫార్వర్డ్ మెసేజ్లలో 25శాతం తగ్గిపోయినట్లు వాట్సాప్ వెల్లడించింది.ఇక ఫార్వర్డ్ మెసేజ్ అని చెప్పేందుకు ఈ మధ్య మరో సింబల్స్ వాట్సాప్లో కనిపిస్తున్నాయి. దీని ద్వారా అది చైన్ మెసేజా లేక సాధారణ సందేశమా అనేది యూజర్ తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఫలానా మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయ్యిందనేది కూడా తెలుస్తుంది.