ఇండియాకు షాక్: ఆగస్టా వెస్ట్లాండ్ కేసులో మిలాన్ కోర్టు సంచలన తీర్పు
మిలాన్:ఆగస్టా వెస్ట్లాండ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇటలీలోని మిలాన్ అప్పీల్స్ కోర్టులో భారత్కు చుక్కెదురైంది. భారత ప్రభుత్వంతో 2010లో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందంలో లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లియానార్డో మాజీ ఎగ్జిక్యూటివ్లను ఇద్దరికి ఈ కేసు నుంచి మిలాన్ కోర్టు విముక్తి కలిగించింది.
లంచం తీసుకున్నారనేందుు తగినన్ని ఆధారాలు లేవని అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఇటలీ స్టేట్ కంట్రోల్డ్ డిఫెన్స్ గ్రూప్ ఫిన్మెక్కానికా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుసెప్పే ఓర్సి, అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ యూనిట్ మాజీ హెడ్ బ్రునో స్పాగ్నోలినికి లంచం అభియోగాల నుంచి విముక్తి కలిగించింది.
ఈ కేసులో పలు కోణాల నుంచి దర్యాప్తు సాగిస్తున్న సీబీఐకు ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో వీవీఐపీల పర్యటనల కోసం రూ.3,600 కోట్ల విలువైన 12 అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల సరఫరాకు ఇటలీ కంపెనీ ఫిన్ మెక్కానికా భారత రక్షణ శాఖతో 2010లో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు రావడం భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సీబీఐ దర్యాప్తు చేపట్టడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకున్నాయి.