అరుణాచల్ పెద్ద వివాదమే: మోడీ టూర్కు ముందు చైనా షాక్
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ అంశం చాలా కీలకమైనదని, అది పెను వివాదమేనని చైనా వ్యాఖ్యానించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ను లేవనెత్తడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై తమ హక్కుకు సంబంధించి భారత్తో ఒక పెను వివాదం ఉందని, ఇది ఎవరూ కాదనలేని వాస్తవమనీగురువారం పేర్కొంది.
సరిహద్దు సమస్యను రెండు దేశాలు అంగీకారయోగ్యంగా పరిష్కరించుకునేందుకు తగిన సానుకూల వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలన్న ప్రధాని మోడీ అభిప్రాయాన్ని సమర్థిస్తూనే అరుణాచల్పై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హూ చునియింగ్ పై వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని భారత్ అరుణాచల్ ప్రదేశ్లోనూ అమల్లోకి తీసుకురాబోతున్న అంశం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆమె ఈ విధంగా స్పందించారు. భారత్తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే విషయంలో తమ దేశం ఎప్పుడూ నిలకడైన, స్పష్టమైన వైఖరి అవలంబిస్తూ వచ్చిందన్నారు.
వచ్చే నెలలో ప్రధాని మోడీ చైనాలో పర్యటించనున్న దృష్ట్యా దానికన్నా ముందే అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారాన్ని మరోసారి భారీ వివాదాస్పదం చేయడం ఒక దౌత్యపరమైన ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, తొమ్మిది రోజులపాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో పర్యటించేందుకు ప్రధాని మోడీ గురువారం బయలుదేరి వెళ్లారు.