చీ చైనా: భారతీయులపై జాత్యాహంకారం
న్యూఢిల్లీ: చైనా విమానాయాన సంస్థ ఎయిర్ చైనా భారతీయుల మీద జాతివివక్షపూరిత వ్యాఖ్యలు చేసింది. లండన్ లో భారతీయులు నివాసం ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తన ప్రయాణికులను హెచ్చరించింది.
సాధారణంగా లండన్ చాల సురక్షితమైన ప్రాంతం అని ఎయిర్ చైనా చెప్పింది. ఆ వెంటనే లండన్ లో భారతీయులు, పాకిస్థానీలు, నల్లజాతీయులు నివాసం ఉండే ప్రాంతాల్లో నిత్యం జాగ్రత్తగా ఉండాలని తన ప్రయాణికులకు సూచించింది.
ఎయిర్ చైనా చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను అదే దేశానికి చెందిన ఓ సీనియర్ చైనీస్ మహిళా జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. ఎయిర్ చైనా మ్యాగజీన్ లో జారీ చేసిన హెచ్చరికలను జర్నలిస్టు హేజ్ ఫ్యాన్ ట్విట్టర్ లో వెల్లడించారు.
ఆ మహిళా జర్నలిస్టు ఆ మ్యాగజీన్ స్క్రీన్ షాట్ ను పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ను ట్యాగ్ చేశారు. పాకిస్థానీ దంపతులకు సాధిక్ ఖాన్ జన్మించిన విషయం తెలిసిందే.
దక్షిణ లండన్ లో భారతీయులు, పాకిస్థానీలు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. లండన్ సురక్షితమైన ప్రాంతం అని మేయర్ సాధిక్ ఖాన్ అందరిని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ లండన్ లోని సందర్శనీయ ప్రాంతాల గురించి తన బ్లాగ్ లో ప్రమోట్ చేస్తున్నారు.
లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ప్రచారాన్ని దెబ్బతీసే విధంగా ఎయిర్ చైనా తన ప్రయాణికులు ఇలాంటి సలహాలు జారీ చేస్తుందని మహిళా జర్నలిస్టు హేజ్ ఫ్యాన్ సీఎన్ఎన్ మీడియాతో పేర్కొంది.