జాగ్రత్త : వాయు, శబ్ద కాలుష్యాలతోనే గుండె పోటు, మధుమేహం
వాషింగ్టన్ డీసీ: వాయు కాలుష్యం, వాహనాల ద్వారా వెలువడే శబ్ద కాలుష్యాలు మనిషి గుండెపోటుకు లేదా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహాంలాంటి వ్యాధులకు కారణమవుతున్నాయని ఒక నూతన అధ్యాయనం వెల్లడించింది. స్విస్ ట్రాపికల్ మరియు పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది. ఇదే అంశాన్ని యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురించారు.
వాయు కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యం రెండూ కలిపి మనిషి గుండెపోటుకు కారణమవుతున్నాయని స్టడీ పేర్కొంది. 2000 నుంచి 2008 మధ్య మృతి చెందిన వారని పరిశీలిస్తే గుండెపోటుతో, మధుమేహంతో చనిపోయిన వారిలో చాలామంది వాయుకాలుష్యం శబ్ద కాలుష్యం కలయికతోనే మృతి చెందారని వారి పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు.
"మేము చేసిన పరిశోధనల్లో వాహనాల నుంచి వచ్చే అధిక శబ్దం వల్లే గుండె సంబంధింత వ్యాధులు వస్తున్నాయి. ఇది సాధారణంగా ఇంట్లో వచ్చే శబ్దాలకంటే సగటున 2 నుంచి 3.4శాతం అధికంగా ఉంటాయి." అని పరిశోదన బృందానికి చెందిన మార్టిన్ రూస్లీ చెప్పారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ద్వారానే గుండె సంబంధింత వ్యాధులు వస్తున్నప్పటికీ ఈ రెండిటిని వేర్వేరుగా చూడాలని అన్నారు. అంతేకాదు ఎవరైతే ఎక్కు వగా వాయుకాలుష్యానికి కానీ, శబ్ద కాలుష్యానికి కానీ అలవాటు పడిపోయి ఉంటారో అలాంటి వారిలో గుండెసంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదైనట్లు స్టడీ స్పష్టం చేసింది.
సాధారణంగా వాయుకాలుష్యం, లేదా శబ్ద కాలుష్యంతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై పలు వేదికలపై చర్చలు జరుగుతున్నాయని రెండూ కలిస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో అన్నదానిపై మాత్రం ఫోకస్ చేయడం లేదని రూస్లీ తెలిపారు. అయితే తమ పరిశోధన మాత్రం రెండిటినీ పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. ఇకపై భవిష్యత్తులో మనిషి ఆరోగ్యం పై ఎలాంటి పరిశోధనలు చేసినా వాయు శబ్ధ కాలుష్యాలను పరిగణలోకి తీసుకని తద్వారా గుండె సంబంధింత వ్యాధుల స్థాయిని అంచనా వేయాలని సూచించారు.