కాలుష్యం కోరల్లో భారత్: లక్షమందికి పైగా చిన్నారులను మింగేసిన కాలుష్య రాకాసి
భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలుష్యం రాకాసి ఎంతో మంది ప్రాణాలు తోడేస్తోంది. మరి ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అవి ఆచరణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరనుంచి పండు ముదసలి వరకు ఈ కాలుష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కాలుష్యం బారిన పడి ఐదేళ్ల లోపు చిన్నారులు ఒక్క 2016లోనే 1.25 లక్షల మంది మృతి చెందినట్లు ప్రపంచఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.
భారత్లో కాలుష్యం బారిన పడి 1.25 లక్షల మంది చిన్నారులు మృతి
స్వల్ప మధ్య ఆదాయం కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే నిర్వహించింది. ఎయిర్ పొల్యూషన్ అండ్ చైల్డ్ హెల్త్ పేరుతో రిపోర్టు సిద్ధం చేసింది. దీని ప్రకారం ఇంటి నుంచి విడుదల అవుతున్న కాలుష్యం, బయటి కాలుష్యం పరిగణలోకి తీసుకుంది. ఇవి పిల్లల ఆరోగ్యాలపై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే దానిపై స్టడీ చేసింది. ఈ పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలను చూసి షాక్కు గురైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇంట్లో బొగ్గులను కాల్చడం వల్ల విడుదలయ్యే పొగతో ఐదేళ్లలోపున్న 67వేల మంది చిన్నారులు మృతి చెందగా... బహిరంగ ప్రాంతాల్లో విడుదలయ్యే కాలుష్యం బారిన పడి 61వేల మంది చిన్నారులు చనిపోయినట్లు సంస్థ వెల్లడించింది. 2016లో బహిరంగ ప్రదేశాల్లో విడుదలైన కాలుష్యం బారిన పడి 2016లో భారత్లో ఎక్కువగా పిల్లల మరణాలు జరిగాయని చెప్పిన సంస్థ... ఇళ్ల నుంచి విడుదలైన కాలుష్యం బారిన పడి మృతి చెందిన పిల్లల సంఖ్య రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. మొదటి స్థానంలో నైజీరియా ఉన్నట్లు సర్వే పేర్కొంది.
పిండం వృద్ధి చెందుతున్న సమయంలోనే కాలుష్యం ఎఫెక్ట్
గాలిలో కాలుష్యానికి చిన్నారుల ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుదని రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా పిండం అభివృద్ధి జరుగుతున్న సమయంలోనే కాలుష్యం వారి ఊపిరితిత్తులు, మెదడులాంటిపై ప్రభావం చూపుతోందని వివరించింది. చిన్నపిల్లలు పెద్దల కంటే త్వరగా శ్వాసను తీసుకుంటారని ఈ క్రమంలో కాలుష్యం కూడా వారు పీల్చుతారని తెలిపింది. ఇక అప్పుడే పుట్టిన పిల్లలను ఇంటిలోని కాలుష్యం కాటేస్తుండగా.. నడుస్తున్న పిల్లలను బయటి కాలుష్యం కాటేస్తోందని సర్వే స్పష్టం చేసింది. ఇక తల్లులు వంట చేసే సమయంలో పిల్లలు వారితోనే ఉంటారు కాబట్టి ఆసమయంలో వారు కాలుష్యం కాటుకు గురవుతున్నారని సర్వే పేర్కొంది.
కాలష్యం నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
వాయు కాలుష్యం ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను చిదిమేస్తోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్. దీన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి చిన్నారి స్వచ్ఛమైన గాలిని పీల్చేలా కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని వారి మెదడును కాలుష్యం పీల్చేస్తోందన్నారు డాక్టర్ మారియా. ఆరోగ్య పరమైన విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అమలు చేస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా వంటకు బొగ్గు ఆధారిత పొయ్యిల వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పారు. చాలా తక్కువ స్థాయిలో కాలుష్యం విడుదలయ్యే పవర్ జనరేషన్ , పరిశ్రమల పై కొన్ని ఆంక్షలు విధించేలా విధానాలను రూపొందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.