ఎయిర్ ఏషియా: లైఫ్ జాకెట్తో మృతదేహం, అనుమానాలు
ఇండోనేషియా: ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 ప్రమాదం ఘటనలో ఓ మృతదేహం బాడీకి లైఫ్ జాకెట్ ఉండటంతో ఈ విషయంలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ బాడీకి లైఫ్ జాకెట్ ఉండటంతో.. ప్రయాణీకులు ప్రమాదాన్ని ముందే ఊహించారా? పైలట్ ప్రమాదాన్ని పసిగట్టి వారికి ఏమైన సంకేతాలు ఇచ్చాడా? అనే కోణంలో చర్చ సాగుతోంది.
ఇండోనేషియాలోని సురబయ నుండి సింగపూర్కు 162 మంది ప్రయాణీకులతో వెళ్తూ ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, వాతావరణం సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో తేలియాడుతున్న మృతదేహాలను, విమాన శకలాలను స్వాధీనం చేసుకోవడానికి బుధవారం కొంత ఇబ్బంది అయింది.
సోనార్ పరికరాలత సాయంతో విమానానికి చెందిన పెద్ద శకలాలు జావా సముద్రం అడుగుభాగంలో ఉన్నట్లు ఇండోనేషియా రక్షణదళ అధికారులు గుర్తించారు. బుధవారం వరకు వారు ఓ మహిళ మృతదేహం సహా ఏడింటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఏం జరిగిందో బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ కోసం వారం రోజులు పట్టవచ్చునని చెబుతున్నారు.
గురువారం ఉదయానికి వాతావరణం అనుకూలించడంతో మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అప్పుడప్పుడు వాతావరణం అనుకూలించడం లేదు. కాగా, 162 మంది (155మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది)తో వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం విమాన శకలాలతో పాటు 40 మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఇండోనేషియా నౌకాదళం అధికారులు ప్రకటించారు. ఇండోనేషియా బోర్నియా ద్వీపం సమీపంలో జావా సముద్రంలో విమానం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు గుర్తించినట్లు ఏవియేషన్ సంస్థ తెలిపింది.
విమాన శకలాలు ఉన్న చోట 40 మృతదేహాలు గుర్తించామని చెప్పారు. ఆ మృతదేహాలను వెలికి తీశారు. వాటిని ప్రత్యేక నౌకల ద్వారా తీరానికి చేర్చినట్లు చెప్పారు. మృతదేహాలు లభించిన బోర్నియా సమీపంలోనే విమానం కూలిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు. కూలిపోయే సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నందునే మృతదేహాలు సముద్ర పైభాగంలోకి వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.