టెహ్రాన్లో కూలిన బోయింగ్ విమానం..ప్రమాదమా లేక ఇతర కారణమా..?
టెహ్రాన్: ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ఇరాక్లో అమెరికా బలగాలు తిష్టవేసి ఉన్న ప్రాంతంపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇక తాజాగా ఓ విమానం టెహ్రాన్లో కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్లోని ఇమామ్ ఖోమేని విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే పరాంద్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాదం సాంకేతికలోపం వల్ల జరిగిందా లేక మరేమైన ఇతర కారణాలతో జరిగిందా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీ దుర్మరణం చెందాక రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య వైరం మధ్య తూర్పు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాక్, ఇరాన్ సహా పర్షియల్ గల్ఫ్ దేశాల మీదుగా తమ దేశ పౌర విమానాల రాకపోకలను అమెరికా నిషేధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు (నోటమ్స్) జారీ చేశారు.
తాజాగా ఇరాక్లో అమెరికా సైన్యం తిష్ట వేసి ఉన్న ప్రాంతంపై ఇరాన్ రెండు క్షిపణి దాడులను ప్రయోగించింది. అమెరికా ఎయిర్ బేస్, ఇతర సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సైతం ధృవీకరించింది. తాజాగా జరిగిన విమాన ప్రమాదం సాంకేతికలోపం వల్ల జరిగిందా లేకుంటే దీన్ని కూల్చేశారా అన్న సంగతిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.