Ajit Doval డర్టీ వార్: బలూచిస్తాన్ గిరిజనుల సహకారం: తిరుగుబాటు కుట్ర: పాక్ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: భారత్పై పాకిస్తాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో చెలరేగుతోన్న నిరసనల వెనుక భారత్ ఉందని ఆరోపిస్తోంది. తమదేశంపై తిరుగుబాటు చేయడానికి భారత్.. అమాయక బలూచిస్తాన్ గిరిజనులను ప్రోత్సహిస్తోందని విమర్శించింది. దీనికంతటికీ కారణం.. ఆ దేశా జాతీయ సలహాదారు అజిత్ దోవల్ అని మండిపడుతోంది పాకిస్తాన్. తమ దేశంలో అశాంతిని రేపడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది.
పాకిస్తాన్ వైమానిక దళ మాజీ అధికారి, రిటైర్డ్ వైస్ మార్షల్, ప్రముఖ కాలమిస్ట్ షెహజాద్ చౌధరి ఈ మేరకు ఓ ఎడిటోరియల్ను రాశారు. ట్రైబ్యున్. కామ్. పాక్ వెబ్సైట్ ఈ కథనాన్ని ప్రచురించింది. అజిత్ దోవల్.. డర్టీ వార్ పేరుతో ఈ కథనం వెలువడింది. తెహ్రిక్-ఐ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)ను ఏకీకృతం చేయడానికి భారత్కు చెందిన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ రెండు గ్రూపులను ఏకం చేసి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసేలా అజిత్ దోవల్ సారథ్యంలో రా పనిచేస్తోందని రాసుకొచ్చారు.
కాశ్మీర్ అంశం నుంచి పాకిస్తాన్ దృష్టిని మరల్చడానికే ఈ కుట్రను పన్నిందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం వెనుక కూడా అజిత్ దోవల్ హస్తం ఉందని ఆరోపించారు. భారత ప్రభుత్వం.. కొన్ని వివాదాస్పద, సున్నిత అంశాల్లో అజిత్ దోవల్ సూచించినట్లగా నడుచుకుంటోందని మండిపడ్డారు. భారత్లో విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలు.. రాజకీయాలతో పెనవేసుకుపోయాయని ఆయన విమర్శించారు.
వివాదాస్పదమైన జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్.. మరింత రెచ్చగొట్టే ధోరణిని అనుసరిస్తోందని, అంతర్జాతీయ దేశాలు దీన్ని తప్పు పట్టాల్సిన సమయం ఆసన్నమైందని షెహజాద్ చౌధరి తన కాలమ్లో రాశారు. కాశ్మీర్కు సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్నయినా భారత ప్రభుత్వం.. అజిత్ దోవల్ను సంప్రదించే తీసుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఇదివరకే కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.