ఎట్టకేలకు జర్మనీకి అలెక్సీ నావల్నీ... ఇప్పటికీ కోమాలోనే... సర్వత్రా ఆందోళన...
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి,విపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)ని మెరుగైన చికిత్స కోసం సైబీరియా నుంచి జర్మనీకి తరలించారు. అయితే అలెక్సీ తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది.అలెక్సీ ఆరోగ్య పరిస్థితిపై దాదాపు 24 గంటల తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు జర్మనీకి తరలించారు. తరలింపు జాప్యం అవడానికి రష్యన్ అధికారులే కారణమని... ఏవేవో కారణాలు చెప్పి అలెక్సీ తరలింపును చివరి వరకు అడ్డుకున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం..? అత్యవసరంగా విమానం ల్యాండింగ్... విషమ పరిస్థితిలో అలెక్సీ...
అలెక్సీ నావల్నీ తరలింపు కోసం బెర్లిన్కి చెందిన ఓ సినీ నిర్మాత ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. జర్మనీ నుంచి ప్రత్యేక వైద్య బృందం అత్యాధునిక వైద్య పరికరాలతో ఆ విమానంలో సైబీరియా వెళ్లారు. అక్కడ అలెక్సీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం అదే విమానంలో జర్మనీకి తరలించారు. ఇప్పటికీ ఆయన కోమాలోనే ఉన్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అలెక్సీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు,అలెక్సీ నావల్నీ తరలింపు జాప్యం వెనుక తమపై వస్తున్న ఆరోపణలను రష్యా అధికారిక వర్గాలు ఖండించాయి. అది పూర్తిగా మెడికల్కి సంబంధించిన నిర్ణయమని,అందులో రాజకీయాలకు తావు లేదని వెల్లడించాయి.
కాగా,గురువారం(అగస్టు 20) సైబీరియాలోని ఒమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో బయలుదేరిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సేవించిన 'టీ'లో విష పదార్థాలు కలపడం వల్లే ఆయన కోమాలోకి వెళ్లినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
అలెక్సీ నావల్నీ రష్యాలో పుతిన్కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్నందువల్లే ఆయనపై వరుస దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీ స్థాపించిన అవినీతి వ్యతిరేక సంస్థ పుతిన్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టడం అధ్యక్షుడికి మింగుడుపడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.