రికార్డులు బద్దలు: అలీబాబా 'గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్'కు భారీ స్పందన..
ఫెస్టివల్ సేల్ తొలి గంటలో సెకనుకు 3.25లక్షల ఆర్డర్స్ వచ్చినట్టు తెలిపింది.
బీజింగ్: ఆన్ లైన్ కస్టమర్లను ఆకర్షించే విషయంలో చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా దూసుకుపోతోంది. ప్రపంచంలో మరే ఇతర ఈకామర్స్ సంస్థకు సాధ్యం కానీ రీతిలో తన సేల్స్ ను పెంచుకుంటోంది. సెకన్లు, నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయాల మార్కెట్ ను అలీబాబా శాసిస్తోంది.
తాజాగా 'గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్' పేరుతో చైనా చేపట్టిన సేల్స్ కు భారీ స్పందన లభించింది. కేవలం రెండు గంటల్లోనే రూ.77వేల కోట్ల విలువైన ఉత్పత్తులను అలీబాబా విక్రయించింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్ తొమ్మిదో ఎడిషన్ ను అలీబాబా ప్రారంభించింది.
కేవలం 24గం. మాత్రమే ఉండే ఈ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్. ఈ దఫా ఫెస్టివల్ సేల్ లో 1.4లక్షల బ్రాండ్స్ కు చెందిన 1.5కోట్ల వస్తువులను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఇందులో యాపిల్, శాంసంగ్, నైక్, జారా, గ్యాప్ లాంటి 60కి పైగా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఉన్నాయి.
ఫెస్టివల్ సేల్ ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 11.9బిలియన్ డాలర్ల(రూ.77వేల కోట్లు) ఉత్పత్తులను విక్రయించినట్టు అలీబాబా ప్రకటించింది. ఫెస్టివల్ సేల్ తొలి గంటలో సెకనుకు 3.25లక్షల ఆర్డర్స్ వచ్చినట్టు తెలిపింది. అలాగే అలీపే ద్వారా సెకనుకు 2.56లక్షల పేమెంట్స్ కూడా జరిగినట్టు అలీబాబా పేర్కొంది.
కాగా, గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్ ను అలీబాబా 2009లో తొలిసారిగా ప్రారంభించింది. గతేడాది 2016లో ఈ సేల్ ద్వారా 18బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను విక్రయించింది. ఈ ఏడాది తొలి రెండు గంటల్లోనే దాదాపు 12బిలియన్ డాలర్ల అమ్మకాలను జరపడం విశేషం.