coronavirus: చైనా నుంచి వచ్చిన భారతీయులందరూ సేఫ్.. ఇంకా టిబెట్ బోర్డర్లోనే
కరోనా వైరస్ భయాలు ఇంకా కొనసాగుతున్నవేళ కేంద్రం ఒక శుభవార్త ప్రకటించింది. చైనాలోని వూహాన్ నుంచి ఇక్కడికి తరలించిన 645 మంది భారతీయుల్లో ఒక్కరు కూడా వైరస్ బారిన పడలేదని, టెస్టులన్నీ నెగటివ్ గా వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రత్యేక విమానాల్లో చైనా నుంచి తీసుకొచ్చిన ఆ 645 మందిని ఇండియా-టిబెట్ బోర్డర్ లోని పోలీస్ క్యాంపులో ఉంచి పరీక్షలు చేశారు. వాళ్లలో ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో సొంత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటుచేసిన స్కానర్ల ద్వారా గురువారం నాటికి మొత్తం 1,265 విమానాల నుంచి వచ్చిన 1.39 లక్షల మంది ప్రయాణికులకు కరోనావైరస్ టెస్టులు చేశామని, వాళ్లలో ఒక్కరికి కూడా పాజిటివ్ ఫలితం రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు కేరళలో మాత్రమే అధికారంగా మూడు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనాను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాయి.
అటు చైనాలో మాత్రం పరిస్థితిన రోజురోజుకూ దిగజారుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ తదితర సిటీల్లో జనం ఇండ్ల నుంచి బయటికి రావడం పూర్తిగా మానేశారు. ఇప్పటికే అక్కడ వేల మందికి వైరస్ సోకగా, వందల్లో మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో జులైలో జపాన్లో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల్ని వాయిదా వేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఒలింపిక్స్ నిర్వాహకులు ఖండించారు. విశ్వక్రీడలు అనుకున్న తేదీల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు.