అమెరికాలో సత్తా చాటిన భారతీయులు- మరోసారి గెలిచిన ఆ నలుగురు- అంతా డెమోక్రాట్లే...
హోరాహోరీగా సాగుతున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు మరోసారి సత్తా చాటారు. గతంలో అమెరికన్ కాంగ్రెస్లోని రెండు సభల్లోనూ వివిధ హోదాల్లో భారతీయులు ఎన్నికవగా.. తాజా ఎన్నికల్లోనూ మనోళ్లు సత్తా చాటుకున్నారు. ఇప్పటికే డెమోక్రాట్ల తరఫున సిట్టింగ్ లుగా ఉన్న వీరంతా మరోసారి ఎన్నిక కావడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికన్ కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు ఈసారి పోటీ చేసిన నలుగురు భారతీయులు విజయం సాధించారు. అంతేకాదు వీరంతా ఇప్పటికే సిట్టింగ్లు ఉంటూ మరోసారి గెలిచారు. వీరిలో కొందరు హ్యాట్రిక్ విజయాలు కూడా అందుకున్నారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురిలో డాక్టర్ అమీ బెరా, ప్రమీలా జైపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ప్రతినిధుల సభకు మరోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో అమెరికన్ల చరిత్రలోనే తొలిసారి నలుగురు భారతీయులు ప్రతినిధుల సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు..
అమెరికా చట్ట సభల్లో ఉన్న భారతీయ అమెరికన్లకు సమోసా కాకస్గా పిలుస్తుంటారు. ఇందులో ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రతినిధుల సభ సభ్యులు కాగా డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్ కూడా ఉన్నారు.
తాజా ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ను సునాయాసంగా ఓడించారు. మరో భారతీయ అమెరికన్ రో ఖన్నా .. రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ ప్రత్యర్ధి రితేష్ టాండన్ను ఓడించారు. మరోవైపు సమోసా కాకస్లోని సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బేరా వరుసగా ఐదోసారి కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెస్ జిల్లాలో గెలిచారు. అలాగే మరో భారతీయుడు ప్రెస్టన్ కులకర్ణి టెక్సాస్లోని 22వ కాంగ్రెస్ జిల్లా నుంచి గెలుపొందారు.