మోడీ వరం: బలూచిస్థాన్లో వినిపించనున్న భారత రేడియో
న్యూఢిల్లీ: బలూచిస్థాన్ ప్రజలు త్వరలో ఆకాశవాణి ప్రసారాలను వినబోతున్నారు. బలూచీ భాషలో కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఆలిండియా రేడియో (ఏఐఆర్)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవాలను వేదికగా చేసుకొని బలూచిస్థాన్ పట్ల సానుకూల వైఖరిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అరాచకాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు.
బలూచిస్థాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించారు. తమ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చినందుకు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు.
కాగా, మోడీ బలూచిస్థాన్ పట్ల సానుకూలంగా మాట్లాడిన నాటి నుంచి పాకిస్థాన్ అక్కడి ప్రజలపై అణచివేతను మరింత తీవ్రం చేసింది. పాకిస్థాన్ సైన్యం తమపై రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందని బలూచిస్థాన్లో ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. తాము తీవ్ర అణచివేతకు గురవుతున్నామని వాపోతున్నారు.
ఉద్యమకారులు చెబుతున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నవారిపై రసాయనిక ఆయుధాలు ఉపయోగించింది. ప్రజలకు సరఫరా అయ్యే నీటిలో విషం కలిపినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 15న దాదాపు 100 మంది నిరసనకారులను హత్య చేసింది.
దాదాపు 150 మందిని కిడ్నాప్ చేసింది. బలూచ్ ప్రజలను జంతువుల కన్నా హీనంగా పరిగణిస్తోంది. పాక్ సైన్యం రసాయనిక ఆయుధాలను వాడినట్లు వెలుగులోకి రావడంతో జర్మనీతోపాటు ఇతర దేశాల్లో నివసిస్తున్న బలూచీలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.