కొందరికీ ఇస్లాం ఫోబియా పట్టుకుంది, అందుకే ఉగ్రవాద ముద్రవేస్తున్నారు : ఇమ్రాన్
ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రపంచంలో 1.3 బిలియన్ల మంది ముస్లింలు ఉన్నారని పేర్కొన్నారు. అమెరికా, యూరప్ లో కూడా ముస్లింలు జీవిస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముస్లింలపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని ఆరోపించారు.
కానీ కొందరికీ ఇస్తాం ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ముఖ్యంగా 9/11 దాడులు జరిగిన తర్వాత ముస్లింలను నిందించడం పనిగా పెట్టుకున్నారని తెలిపారు. అంతకుముందు ముస్లింలతో మిగతావారు సాధారణంగా ఉండేవారని.. కానీ తర్వాత మార్పొచ్చిందని తెలిపారు. ముస్లిం మహిళలు బురఖా ధరించిన కొన్నిదేశాలు సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. బురఖా వెనుక ఆయుధాలు ఏమైనా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.
ముస్లింలపై ఈ భావన రావడానికి కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా కారణమని హెచ్చరించారు. ఇస్లాంలో ఉగ్రవాదాన్ని కొందరు రాడికల్ టెర్రరిజం అని పిలుస్తున్నారు. అసలు రాడికల్ టెర్రరిజం అంటే ఏంటి అని ప్రశ్నించారు. రాడికల్ టెర్రిరిజానికి కూడా ఇస్లాం ఫోబియా ద్వారా వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఏ మతం కూడా ఉగ్రవాదం వైపు మళ్లించబోదన్నారు. అన్ని మతాల్లో న్యాయం, సమానత్వం ఉంటుందని పేర్కొన్నారు.