10 రోజుల పాటు లాహోర్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేత
పెషావర్: పాకిస్ధాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో తాలిబన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. చిన్నారులను అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్లో జనవరి 3 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు.
లాహోర్లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఘటనను తలుచుకుని విద్యార్ధులు వణికిపోతున్నారు.
ఘటనలో చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు. తమ చిన్నారులను గుర్తుకు తెచ్చుకున్ని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉగ్రవాదులు చేసిన దాడిలో విద్యార్ధుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని దేశాల అధినేతలు సంఘటనను ఖండించారు. ఈ దాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులను పాకిస్తాన్ సైన్యం మట్టుబెట్టింది.