నవంబర్ 5నుంచి ఇరాన్పై అన్ని ఆంక్షలు అమల్లోకి వస్తాయి: ట్రంప్
వాషింగ్టన్ : నవంబర్ 5 నుంచి ఇరాన్పై అమెరికా విధించిన అన్ని ఆంక్షలు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మరోవైపు లెబనీస్ మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా పై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు చట్టం చేస్తూ ట్రంప్ సంతకాలు చేశారు. నవంబర్ 5నుంచి ఇరాన్పై పాతపద్ధతి ప్రకారం అంటే ఆంక్షలు ఎత్తివేయబడ్డ అణు ఒప్పందం పై కూడా తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మధ్యలో కొన్ని ఆంక్షలు ఎత్తివేయడం జరిగిందన్న ట్రంప్ ఇప్పుడు తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
అణు ఒప్పందంపై తిరిగి ఆంక్షలు
అణుఒప్పందంపై ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలు ఇకపై కొనుగోలు చేయరాదని కోరారు. ఒకవేళ కొనుగోలు చేస్తే ఆదేశాలపై కూడా ఆంక్షలు విధిస్తామని తెలిపారు. అమెరికా విధించిన ఆంక్షలు భారత్కు కూడా వర్తించనున్నాయి. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ దిగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఇక ఇక ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్... ఇకపై కూడా కొనుగోలు చేయాలంటే అమెరికా ఇందుకు మినహాయింపు ఇవ్వాలి. లేదంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలును క్రమంగా తగ్గించుకుని ఇక ఇరాన్తో స్నేహానికి చెక్ చెప్పాల్సి ఉంటుంది.
హిజ్బుల్లా ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ప్రివెన్షన్ చట్ట సవరణ పై సంతకం
ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున ఆదేశం అణ్వాయుధాల తయారీకి అమెరికా కచ్చితంగా బ్రేక్ వేస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని చెప్పారు. ఇరాన్ పాల్పడుతున్న దారుణాన్ని ప్రతిదేశానికి వివరిస్తామని చెప్పిన ట్రంప్ ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పునరుద్ఘాటించారు. అంతకంటే ముందు ట్రంప్ హిజ్బుల్లా ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ప్రివెన్షన్ చట్ట సవరణ, 2018పై సంతకాలు చేశారు.
1983లో అమెరికా శిబరంపై దాడి..241 మంది అమెరికన్లు మృతి
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ అమెరికన్ పౌరులను కిడ్నాప్ చేసి, హింసించి చంపేసిందని ట్రంప్ ధ్వజమెత్తారు. 1983లో లెబనాన్ రాజధాని బీరట్లో అమెరికా మెరైన్ శిబిరాల్లో 241 మంది అమెరికాకు చెందిన మెరైన్స్ను, సెయిలర్లను, సైనికులను హతమార్చిందని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ గుర్తుచేశారు. మరో ఫ్రెంచి శిబిరంపై బాంబు దాడి చేసి 58 మంది ఫ్రాన్స్ శాంతియుత వాదులను హతమార్చిందని తెలిపారు. కొత్తగా తెచ్చిన చట్టంతో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు అందవని ఆమె పేర్కొన్నారు.
హిజ్బుల్లా సంస్థ చేసిన ఘోరాన్ని అమెరికా ఎప్పటికీ మరువదు
కొత్తగా తెచ్చిన ఆంక్షలు విదేశీయులు కానీ ఇతర ప్రభుత్వ సంస్థలు కానీ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు ఏరూపంలో మద్దతు కానీ నిధులు కానీ ఇవ్వరాదు. బీరట్ శిబిరంలోని అమెరికన్లపై దాడి చేసి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతుల కుటుంబాలతో ఓ సమావేశాన్ని వైట్హౌజ్లో నిర్వహించారు. తను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై ఎన్నడూ లేనన్ని ఆంక్షలు ఒక్క ఏడాదిలోనే విధించామని ట్రంప్ తెలిపారు. వారి లక్ష్యాలను, హిజ్బుల్ సంస్థకు అందుతున్న నిధులను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని చెప్పిన ట్రంప్ అన్ని దారులు మూసుకుపోయేలా చట్టం చేసినట్లు తెలిపారు. ఇక బీరట్లో హిజ్బుల్లా సంస్థ అమెరికన్ పౌరులను మట్టుబెట్టడాన్ని అమెరికా మరిచిపోదని ట్రంప్ గట్టిగా చెప్పారు.