ఉ.కొరియా మరో దుస్సాహసం: మళ్లీ క్షిపణి ప్రయోగం, అమెరికాకు హెచ్చరికనే!
అమెరికా సైతం మమ్మల్ని ఏమి చేయలేదని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
వాషింగ్టన్: ప్రపంచం మొత్తానిది ఓ దారైతే.. ఉత్తరకొరియాది మరో దారి. అన్ని దేశాలు శాంతి మంత్రం జపిస్తుంటే.. ఆ దేశం మాత్రం యుద్దానికి కాలుదువ్వే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అణు క్షిపణుల ప్రయోగం విషయంలో.. ఎవరెంత చెప్పి చూసినా.. తమ దారి తమదే అంటోంది ఆ దేశం.
ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!
ఇప్పటికే 11 అణు క్షిపణులను ప్రయోగించిన ఉత్తరకొరియా.. శుక్రవారం నాడు మరో క్షిపణి ప్రయోగం చేపట్టి తన ఉద్దేశం ఏంటో మరోసారి చాటుకుంది. తాజా క్షిపణి ప్రయోగానికి సంబంధించి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అమెరికాను సైతం మమ్మల్ని ఏమి చేయలేదని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
తాజా క్షిపణి ప్రయోగంతో.. ఈ ఒక్క నెలలోనే ఉత్తరకొరియా రెండు సార్లు అణు పరీక్షలు జరిపినట్లయింది. జులై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. కావాలని రెచ్చగొట్టే రీతిలో ఆ దేశం క్షిపణి ప్రయోగం చేపట్టింది.
శుక్రవారం నాటి క్షిపణి ప్రయోగంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏ లక్షిత ప్రాంతాన్నైనా తాము సులువుగా టార్గెట్ చేయగలమన్న విశ్వాసాన్ని కిమ్ వ్యక్తం చేశారు. తాము దాడి చేయగల పరిధిలోనే అమెరికా మొత్తం ఉందని కిమ్ అభిప్రాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఎప్పుడైనా, ఎక్కడైనా అమెరికా భూభాగంపై దాడి చేయగల సత్తా ఉందంటూ అతివిశ్వాసం ప్రదర్శిస్తున్నారు కిమ్.
అంతేకాదు, క్షిపణిని అభివృద్ధి చేసిన సాంకేతిక నిపుణులను కిమ్ ప్రశంసల్లో ముంచెత్తినట్లు చెబతున్నారు. మరోవైపు అమెరికా మాత్రం ఈ చర్యలను సీరియస్ గా తీసుకుంది. ఉత్తరకొరియా చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడింది. ఇక ఉత్తరకొరియాకు ఏ ఆపద వచ్చినా.. రక్షించే సమస్యే లేదని స్పష్టం చేసింది. ఆ దేశాన్ని 'ఏకాకి'ని చేసేందుకు ఈ ఒక్క కారణం చాలు అని ట్రంప్ అన్నారు.