అమెజాన్ అడవుల్లో మంటలు ఆర్పుతూ.. యుద్ద విమానాలతో నీళ్లు చల్లుతూ..!
బ్రెజిల్ : ప్రపంచ మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు మూడు వారాల నుంచి అమెజాన్ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంపై సరిగా స్పందించలేదని.. ఆ దేశాధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్సనారోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో మంటలు ఆర్పడానికి యుద్ద విమానాలను రంగంలోకి దించారు. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులను ఎట్టకేలకు సంరక్షించడానికి ప్రయత్నాలు ఊపందుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.
యుద్ద విమానాలు సిద్ధం.. నీళ్లు పోస్తూ మంటలు ఆర్పుతూ..!
అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అయితే మూడు వారాల నుంచి అమెజాన్ అడవులు కాలిపోతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను రంగంలోకి దించారు.
అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..!
ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ క్రమంలో అధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్సనారో స్పందించారు. అమెజాన్ అటవీ ప్రాంతంలో మంటలను ఆర్పివేయడానికి ఏడు రాష్ట్రాల్లో సైనిక కార్యకలాపాలకు అధికారం ఇచ్చినట్లు ఆయన కార్యాలయ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆ మేరకు ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇబామాకు చెందిన డజను యెల్లో క్లాడ్ ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగాయి. శనివారం సాయంత్రం రక్షణ మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఒక సైనిక విమానం రెండు దిగ్గజ జెట్లలో వేలాది లీటర్ల నీటిని పంపుతున్నట్లు చూపించింది. అమెజాన్ అడవుల్లో మంటలను ఆర్పడానికి జెట్ విమానాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
24వ తేదీ వరకు 80 వేల మంటలు నమోదు
ప్రస్తుతం ఫ్రాన్స్లో సమావేశమవుతున్న జి7 దేశాల నాయకులు.. అమెజాన్ అడవుల మంటలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రతిస్పందన వచ్చింది. అమెజాన్ మంటల బారిన పడిన దేశాలకు "సాంకేతిక మరియు ఆర్థిక సహాయం" అందించే ఒప్పందానికి జి7 ఒప్పందం కుదుర్చుకుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు బ్రెజిల్లో దాదాపు 80,000 మంటలు నమోదైనట్లు తెలుస్తోంది. 2013 నుండి ఈసారి అత్యధికంగా మంటలు నమోదైనట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ INPE తెలిపింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగడం గమనార్హం.
అమెజాన్ మంటలపై పోరాడటానికి బ్రెజిల్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ప్రజలు, ప్రపంచ స్థాయి నాయకుల నుండి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో మిలిట్రీని రంగంలోకి దించుతున్నట్లు శుక్రవారం నాడు బోల్సోనారో ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విమానం ఇవ్వడం మరియు అగ్నిమాపక చర్యలకు ప్రత్యేక మద్దతు ఇవ్వడం, ఇరువురు నాయకుల మధ్య అంగీకారం కుదిరాక తాను ఒప్పుకున్నట్లు తెలిపారు.
మానవ తప్పిదాలే కారణమా?
గత కొన్నాళ్లుగా అమెజాన్ అడవుల్లో మంటల ధాటికి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయనేది పర్యావరణవేత్తలు చెబుతున్న మాట. అడవుల్లో చెట్లను ఇష్టారాజ్యంగా కొట్టేయడం కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటి సీజన్లో అధిక ఉష్ణోగ్రతతో పాటు తక్కువ స్థాయిలో ఉండే ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే అయినప్పటికీ.. ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగించే పరిణామమే.
అమెజాన్ అడవుల్లో రికార్డ్ స్థాయి మంటలు చెలరేగాయనే దానికి నిదర్శనంగా నాసా శాటిలైట్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం ఆక్సిజన్ అందించడానికి ఆధారంగా నిలుస్తున్న అమెజాన్ అడవులు ఇప్పుడు కాలి బూడిద అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.
పర్యావరణవేత్తల ఆందోళన
మానవాళికి అధిక స్థాయిలో ప్రాణవాయువును అందించే అమెజాన్ అడవులు ఇలా కాలి బూడిద అవుతుండటాన్ని చూసి పర్యావేరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సౌత్ అమెరికా బ్రెజిల్ ప్రాంతంలోని ఈ అడవులు ప్రతి యేటా రికార్డు స్థాయిలో దగ్ధం అవుతుండటం ప్రాణ వాయువుపై భయాందోళన పుట్టిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసర్చ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక కూడా ఇదే విషయం తేటతెల్లం చేస్తోంది. అమెజాన్ అడవుల్లో చెట్లను నరికివేయడం ఎక్కువైనట్లు ఆ రిపోర్టులో పేర్కొంది.