చైనాకు షాకిచ్చిన అమెరికా: 24 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చిన యూఎస్, వారిపై ఆంక్షలు
వాషింగ్టన్: చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. రెండు డజన్ల చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చింది. ఇందుకు కారణమైన అధికారులపైనా ఆంక్షలు విధించింది.
Recommended Video
చైనా షిప్ నిర్మాణ గ్రూపులో భాగమైన చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్చన్ కో, టెలికమ్యూనికేషన్ సంస్థలతోపాటు మరో 24 కంపెనీలను బుధవారం అమెరికా బ్లాక్లిస్టులో చేర్చింది. పలు దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటకిీ సౌత్ చైనా సముద్రంలోని దీవుల్లో సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ చర్యకు ఉపక్రమించింది.
దక్షిన చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాల్లో కృత్రిమ దీవులను నిర్మించి వాటిలో చైనా తమ మిలిటరీ బలగాలను మోహరిస్తోందని యూఎస్ కామర్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలోని సుమారు 3వేల ఎకరాల వివాదాస్పద ప్రాంతాన్ని దక్కించుకునేందుకు 2013 నుంచీ చైనా కుట్రలు పన్నుతోంది. ఈ చర్య ఇరుగుపొరుగు దేశాల సార్వభౌమత్వానికి సవాలుగా మారింది. అంతేగాక, ప్రకృతిని కాలుష్యం చేసేదిగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తెలిపారు.
చైనాకు చెందిన 24 కంపెనీలు బ్లాక్ లిస్టులోకి చేరడంతో ఇక అమెరికా ఆ సంస్థలకు ఎలాంటి వస్తువులను, సరుకులను అందించబోదు. అంతేగాక, సౌత్ చైనా సముద్రంలో కార్యకలాపాలకు సహకరించిన వారెవరికి కూడా అమెరికా వీసాలను జారీ చేయదని పాంపియో స్పష్టం చేశారు.