అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది..! సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తరకొరియా..!!
ప్యాంగ్యాంగ్/హైదరాబాద్ : అమెరికా ఉత్తర కొరియా మద్య మాటల యుద్దం నడుస్తోంది. అమెరికా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఆ నౌక ప్రయాణించిందన్న అనుమానంతో ఇటీవల దాన్ని అమెరికా స్వాధీనం చేసుకుని, దీనిపై దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ చర్యను ఘోరమైన చోరీ అని పేర్కొంటూ ఉత్తరకొరియా మంగళవారం ఓ ప్రకటన చేసింది. గతేడాది జూన్లో ఉత్తరకొరియా-అమెరికా చేసిన సంయుక్త ప్రకటన స్ఫూర్తిని పూర్తిగా తోసిపుచ్చేలా ఈ చర్య ఉందిని ఉత్తర కొరియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
నిబంధరలకు తూట్లు..! పరస్పరం ఆరోపించుకుంటున్న ఉ.కొరియా.. అమెరికా..!!
మాపై వీలైనంత ఒత్తిడిని తెచ్చేలా అమెరికా తనదైన శైలిని మరింత విస్తృత పర్చుతూ ఈ చర్యకు పాల్పడింది అని ఉత్తరకొరియా రక్షణ శాఖ అధికారి అన్నారు. తమ శక్తితో ఉత్తరకొరియాను అదుపు చేయొచ్చని అమెరికా అనుకోవడం చాలా తప్పుడు భావన అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు మరోసారి దిగజారుతున్నట్లు కనపడుతున్న విషయం తెలిసిందే.
అమెరికా పలు డిమాండ్లు..! ఆమోదయోగ్యంగా లేవంటున్న కిమ్..!!
అమెరికా మొట్టమొదటి సారి ఉత్తరకొరియాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గతేడాది మొదటిసారి సింగపూర్లో భేటీ అయ్యారు. రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలోని హనోయిలో చర్చించారు. అణ్వస్త్ర సమస్యపై వారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా పెడుతున్న డిమాండ్లు తమకు ఆమోదయోగ్యంగా ఉండట్లేదని ఇటీవల కిమ్ ప్రకటించారు.
మళ్లీ ఆయుధాల పరీక్ష..! ఉ.కొరియా తీరును ఖండించిన అమెరికా..!!
కొన్ని రోజుల క్రితం దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించిన ఉత్తరకొరియా వారం రోజులు కాక ముందే మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించి అలజడి రేపింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా.. నౌకను స్వాధీనం చేసుకోవడం మోసపూరిత చర్యగా ఉత్తరకొరియా పేర్కొంది. సింగపూర్ సదస్సు ఒప్పంద స్ఫూర్తిని అమెరికా కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్రంప్ రిసార్ట్ సమీపంలో కాల్పులు..! ఉలిక్కి పడ్డ భద్రతా యంత్రాంగం..!!
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన ఓ రిసార్టు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్లో ట్రంప్ ఇంటర్నేషనల్ బీచ్ రిసార్టు వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలు వాహనాలకు తూటాలు తగలడంతో రంధ్రాలు పడ్డాయి. ఈ ఘటనలో తలకు గాయమైన మహమ్మద్ జ్రాదీ (43) అనే వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఓ వాహనంలో 19 ఏళ్ల యువతి తూటా గాయాలతో పడిఉండగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరో ఐదేళ్ల బాలుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.