భారత్పై మరో ఉగ్రదాడి జరిగిందో..! పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్ : పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టింది అగ్రరాజ్యం అమెరికా. ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత్ పై మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్టు గ్రూపులపై ఆ దేశం శాశ్వత చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్
ఉగ్రసంస్థలను నిరోధించాల్సిందే
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న పరిస్థితి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో అమెరికా పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు వైట్ హౌస్ లోని ఉన్నతాధికారి పలు వివరాలు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలపై కన్నెర్ర జేయకుండా వాటికి పాకిస్థాన్ సానుకూల పరిస్థితులు కల్పించడం సరికాదని మండిపడ్డారు. భారత్ పై మరోసారి ఉగ్రదాడి జరిగితే పాకిస్థాన్ విపత్కరమైన చిక్కుల్లో పడటం ఖాయమని హెచ్చరించారు.
వేచి చూడాల్సిందే..!
ఉగ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ శాశ్వత చర్యలు తీసుకునేలా అంతర్జాతీయ సమాజం ఒప్పించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టెర్రరిస్టుల పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికిప్పుడు అంచనా వేయడం సరికాదంటున్నారు. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఇటీవల బ్యాంకు ఖాతాలు స్థంభింపజేయడం, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలు చేపట్టిందని వివరించారు.
ఇక పాకిస్థాన్ ఇష్టం
ఇదివరకు కొంతమంది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకుని కొన్ని నెలల తర్వాత వారిని విడుదల చేసిన చరిత్ర పాకిస్థాన్ సొంతమని వ్యాఖ్యానించారు. అందుకే మరికొంత కాలం వేచి చూస్తే పాకిస్థాన్ ఆంతర్యం బయటపడుతుందని చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ శాశ్వత చర్యలు తీసుకునేలా.. అంతర్జాతీయంగా ఆ దేశంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. బాధ్యతయుతమైన అంతర్జాతీయ భాగస్వామిగా కొనసాగుతుందా.. లేదంటే మరింత ఏకాకిగా మారుతుందో పాకిస్థాన్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.