తనను తాను మహ్మద్ ప్రవక్తగా: అమెరికా పౌరుడిపై పాక్ కోర్టులో బుల్లెట్ల వర్షం: దైవదూషణగా
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను తాను మహ్మద్ ప్రవక్తగా ప్రకటించుకున్న ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించాడు. పాకిస్తాన్కు చెందిన వాడే అయినప్పటికీ.. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. ఈ ఘటన పట్ల అమెరికా స్పందించింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఘటన పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసింది.
చర్చల వేళ.. చైనా వితండ వాదం: ఆ ప్రాంతం నుంచి ఎప్పుడో వెనక్కి వెళ్లినట్టు: అంగీకరించని ఆర్మీ
మృతుడి పేరు తాహిర్ అహ్మద్ నసీం. రెండేళ్ల కిందట ఆయన తనను తాను మహ్మద్ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. తనను తాను మహ్మద్ ప్రవక్తగా ప్రకటించుకోవడాన్ని మత పెద్దలు తప్పుపట్టారు. ఆయనపై ఫిర్యాదు చేశారు. దైవదూషణ (బ్లాష్ఫేమి) కింద ఆయనపై కేసు నమోదైంది. పాకిస్తాన్ పీనల్ కోడ్ 295-ఏ, 295-బీ, 295-సీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. 2018 నుంచీ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయనను పెషావర్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
న్యాయమూర్తి షౌకతుల్లా ఖాన్ విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతోన్న సమయంలో ఓ దుండగుడు హఠాత్తుగా కోర్టు రూమ్లోకి చొచ్చుకొచ్చాడు. తాహిర్ను ఉద్దేశించి ఇస్లాంకు శతృవుగా నినాదాలు చేశాడు. ఆయన ప్రవక్త కాదని, ఇస్లాంకు వ్యతిరేకి అంటూ కేకలు వేశాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకితో తాహిర్పై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. దీనితో తాహిర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో ప్రాణాలను కోల్పోయారు. అనంతరం నిందితుడు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అతణ్ని పట్టుకున్నారు.
నిందితుడిని పెషావర్ సెంట్రల్ జైలుకు తరలించారు. తాహిర్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఖైబర్ మెడికల్ యూనివర్శిటీకి తీసుకెళ్లారు. పాకిస్తాన్లో దైవదూషణ చట్ట విరుద్ధం. దైవదూషణకు పాల్పడిన వారికి అంతిమంగా మరణశిక్షను విధిస్తారు. ఇప్పటిదాకా దైవదూషణ వల్ల మరణశిక్షను విధించిన సందర్భాలు చోటు చేసుకోలేదు. ఈ విషయంలో దైవ దూషణకు పాల్పడిన వారిపై ప్రాణాపాయ దాడులు కొనసాగిన రోజులు ఉన్నాయి. ఈ ఘటనను కూడా అదే దృష్టితో చూస్తున్నారు.
Recommended Video
ఈ ఘటన పట్ల అమెరికా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కోర్టు రూమ్లో తమ దేశ పౌరుడు తాహిర్ వసీంను కాల్చి చంపడాన్ని సరికాదని పేర్కొంది. ఆయన కుటుంబ సభ్యలకు సంతాపాన్ని తెలియజేసింది. ఇలాంటి ఘటనలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.