బదలీ కోరితే ఉద్యోగం ఔట్: భారత సంతతి ఉద్యోగికి అమెరికా కంపెనీ లక్షడాలర్ల పరిహారం
వాషింగ్టన్: ఓ భారతీయుడిపై వివక్ష చూపించినందుకు గాను అమెరికాకు చెందిన కాంబర్ కార్పోరేషన్ సంస్థ అతనికి 1,00,000 డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అతను కంపెనీని కోర్టుకు లాగడంతో పరిహారం కోసం ఒప్పుకుంది.
మరోచోటుకు బదలీ చేయాలని కోరడంతో
తనపై వివక్ష చూపించిందని దావా వేస్తే, దానిని పరిష్కరించుకునేందుకు ఆ కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చింది. అశోక్ పేయ్ అనే వ్యక్తి దివ్యాంగుడైన తన కుమారుడిని చూసుకునేందుకు, అతడికి దగ్గరగా ఉండేందుకు మరోచోటుకు బదిలీ చేయమని కంపెనీకి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించింది
కొడుకు కోసం కొన్ని రోజులు సెలవు అడిగారు. కానీ కంపెనీ నిరాకరించడంతో పాటు అతనిని ఉద్యోగం నుంచి తీసివేసింది. దీంతో ఆయన అమెరికా సమాన ఉద్యోగ అవకాశ కార్పొరేషన్ను(ఈఈఓసీ- అమెరికా ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్) ఆశ్రయించాడు.
విచారణలో తేలిన ఉల్లంఘన
ఆ కంపెనీలో బాధితుడు ఫెడరల్ కాంట్రాక్టరుగా పని చేశాడు. తనను ఉద్యోగంలో నుంచి తొలగించి వయసులో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నవాడైన వ్యక్తిని నియమించారని, తన కొడుకు వైకల్యంతో పాటు తన వయసు కారణంగా కూడా తనపై వివక్ష చూపారని అతను దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన ఈఈఓసీ.. కంపెనీ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
లక్ష డాలర్ల పరిహారం
అశోక్ కుమారుడి ఆరోగ్య పరిస్థితి వల్ల బదిలీకి నిరాకరించడం చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాంబర్ వర్జీనియా కార్యాలయంలో ఉద్యోగి పట్ల వివక్ష చూపినట్లు అమెరికా న్యాయ విభాగం కూడా తెలిపింది. దీంతో కంపెనీ ఈ దావాను పరిష్కరించేందుకు అతనికి లక్ష డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.