ఈయేటి సాహితీ నోబెల్ విజేత.. కవయిత్రి లూయిస్ గ్లూక్ - 27ఏళ్ల తర్వాత అమెరికన్ వనితకు అవార్డు
ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య అవార్డు ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్ గ్లూక్ను వరించింది. బ్రహ్మాండ విశ్వంలో వ్యక్తిగత ఉనికికి సంబంధించి తన రచనల్లో గ్లూక్ అద్భుతమైన కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్న ఆమె ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు వెలువరించారు. చిన్నతనం నుంచి ఫ్యామిలీ లైఫ్ వరకు ఆమె అనేక రచనలు చేశారు. కుటుంబీకుల మధ్య సంబంధాలు ఆమె రచనల్లో ప్రధానాంశాలుగా ఉంటాయి.
ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్
1993లో టోని మొర్రిసన్ నోబెల్ సాహితీ పురస్కారాన్ని అందుకున్న 27 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న అమెరికన్ కవయిత్రి లూయీస్ గ్లూక్ కావడం గమనార్హం. 2006లో ఆమె 'అవెర్నో' అనే సంకలనం రాశారు. అనేక ప్రాచీనకాలం నాటి అంశాలపై ఆ రచనల్లో తన అభిప్రాయాలను ఆమె వినిపించారు. 2014లో ఫేయిత్ఫుల్, వర్చువస్ నైట్ అన్న శీర్షికలతో సంకలనం విడుదల చేశారు.
లూయిస్ గ్లూక్ 1943లో న్యూయార్క్లో జన్మించారు. ప్రస్తుతం ఆమె క్యాంబ్రిడ్జ్లో నివసిస్తున్నారు. యేల్ వర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూనే ఆమె అనేక కవితలను రచించారు. 1968లో తొలి రచన ఫస్ట్బర్న్. అతి త్వరలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రఖ్యాత కవయిత్రిగా పేరుగాంచారు. గతంలో గ్లూక్ అనేక మేటి అవార్డులను గెలుచుకున్నారు. 1993లో పులిట్జర్ ప్రైజ్ను కైవసం చేసుకున్నారామె. 2014లో నేషనల్ బుక్ అవార్డును గెలుచుకున్నారు.
నోబెల్ ప్రైజ్ కింద లూయిస్ గ్లక్ 1.1 మిలియన్ యూఎస్ డాలర్లను అందుకోనున్నారు. ఏటా డిసెంబర్ 10న స్టాక్హోమ్లో నిర్వహించే అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసేవారు. అయితే.. కరోనా సంక్షోభం కారణంగా ఈసారి ఈ కార్యక్రమాన్ని టెలివిజన్కే పరిమితం చేశారు. అవార్డు విజేతలను ఎంపిక చేసే స్వీడిష్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018లో సాహిత్య రంగంలో నోబెల్ ప్రకటనను వాయిదా పడటం తెలిసిందే. గతేడాది 2018, 2019 సంవత్సరాలకు గాను రెండు పురస్కారాలను ఒకేసారి ప్రకటించాగా, 2020కిగానూ గ్లక్ ఎంపికయ్యారు. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మందికి నోబెల్ బహుమతి దక్కగా.. వీరిలో 16 మంది మహిళలు ఉండటం విశేషం.