దారుణం: పర్యాటకురాలిపై గ్యాంగ్రేప్, వేళ్లు నరికారు
సిడ్నీ: పుప్వా న్యూ గినియా(పిఎన్జి)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటక జంటను ఆయుధాలతో బెదిరింపులకు గురిచేసిన దుండగులు.. మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఓ మహిళ(31), లండన్కు చెందిన తన స్నేహితుడి(31)తో కలిసి పపువా న్యూ గినియా పర్యటనకు వెళ్లింది. అక్కడి ఓ అడవిలో ట్రెక్కింగ్కు వెళ్తుండగా.. కొందరు దుండగులు వారిపై దాడిచేశారు. వారి దగ్గరున్న నగదు(5వేల డాలర్లు), మొబైల్ ఫోన్లు, షూలు లాక్కున్నారు.
అనంతరం మహిళ స్నేహితుడిని చెట్టుకు కట్టేసి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాడిని మహిళ ప్రతిఘటించడంతో ఆమె చేతి వేళ్లను నరికేశారు.
ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆమె స్నేహితుడు సమీపంలోని గ్రామంలోకి తీసుకెళ్లగా.. స్థానికులు వారికి సాయం అందించారు. సమీపంలోని ఆస్పపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, దాడికి పాల్పడిన నిందితుల్లో ఒకడిని గ్రామస్తులు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. లైసెన్స్ లేని టూర్ ఆపరేటర్ ద్వారా ఈ జంట ఇక్కడకు వచ్చిందని ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గతంలో కూడా పప్వా న్యూ గినియాలో పర్యాటకులపై లైంగిక దాడులు జరిగినట్లు వెల్లడించింది.