రైలు పట్టాలపై తోసి ఇండియన్ హత్య: అమెరికన్ మహిళకు 24ఏళ్ల జైలు
న్యూయార్క్: ఓ భారతీయుడ్ని రైలు పట్టాలపై తోసేసి అతని మరణానికి కారణమైన అమెరికన్ మహిళకు అక్కడి న్యాయస్థానం 24ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సునందో సేన్(46) అనే భారతీయుడిని రైలు పట్టాలపైకి తోసి చంపేసిన ఘటనలో అమెరికన్ మహిళ ఎరికా మెనెన్డెజ్కు 24ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
2012, డిసెంబర్ 27న న్యూయార్క్లోని సబ్వే స్టేషన్లో రైలు వస్తున్న సమయంలో ఎరికా సునందో సేన్ను పట్టాలపైకి తోసేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్వీన్స్ సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఎరికాను దోషిగా ప్రకటించింది.
కాగా, ఇప్పుడు 24ఏళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని ఫాక్స్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. గతంలో కోర్టు విచారణ సమయంలో ఎరికాను ఎన్ని సార్లు ప్రశ్నించినా తను ఎందుకు అతడిని రైలు పట్టాలపైకి తోసేసిందో గుర్తులేదని చెప్పింది.
అరెస్టయిన అనంతరం పోలీసులతో.. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై జడ్జి ఆమెను తీవ్రంగా ప్రశ్నించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.