అమెరికాలో సిక్కులపై వరుస దాడులు.. కారణం ఇదే!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కుల పైన పలుమార్లు దాడులు జరిగాయి. 9/11 తీవ్రవాద దాడి అనంతరం అమెరికాలో సిక్కుల పైన దాడులు చాలా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలిఫోర్నియాలో 68 ఏళ్ల అమృక్ సింగ్ బాల్ పైన ఇద్దరు తెల్లవాళ్లు దాడికి పాల్పడ్డారు.
ఇరవయ్యేళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు అతని పైన శనివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. సిక్కుల పైన వరుసగా అమెరికాలో దాడి జరగడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. అమెరికన్లు చాలామంది సిక్కులను ముస్లీంలుగా భావిస్తున్నారట.
ఈ కారణంగానే దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇటీవల రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిక్కులను ముస్లీంలుగా భావించి కొందరు దాడి చేస్తున్నారని అంటున్నారు.
2001 సెప్టెంబర్ 11వ తేదీన తీవ్రవాదుల దాడి అనంతరం అమెరికాలో యాంటీ ఇస్లామిక్ సెంటిమెంట్ బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో సిక్కులకు బాగా పొడగాటి గెడ్డం ఉండటంతో వారిని ముస్లీంలుగా భావించి దాడులు చేస్తున్నారని అంటున్నారు.
కాగా, 2001లో తీవ్రవాదుల అటాక్ అనంతరం సిక్కుల పైన ఒక్క నెలలోనే దాదాపు 300 దాడులు లేదా వివక్ష జరిగిందని తెలుస్తోంది. ఇటీవల ప్యారిస్లో తీవ్రవాదుల దాడుల అనంతరం మరోసారి సిక్కులు లక్ష్యంగా మారారని అంటున్నారు.