చైనాకు కళ్లెం:తొలిసారి భారత్- ఫ్రాన్స్-ఆస్ట్రేలియా త్రైపాక్షిక చర్చలు -ఇండో పసిఫిక్ రీజియన్పై ఫోకస్
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) పేరుతో ఇతర ఖండాలకు రహదారులు నిర్మిస్తోన్న చైనా.. సముద్ర జలాలపైనా పట్టు సాధించేందుకు పాకులాడుతోంది. ప్రధానంగా ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఇటీవల చైనా నావికా దళం హడావుడి బాగా పెరిగింది. దీంతో డ్రాగెన్ దూకుడుకు కళ్లెం వేసే దిశగా భారత్-ఫ్రాన్స్-ఆస్ట్రేలియాలు తొలిసారి ఏకమయ్యాయి.
మూడు దేశాల విదేశాంగ శాఖల ముఖ్య అధికారుల మధ్య బుధవారం త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పరస్పరం సహకరించుకునే దిశగా భారత్-ఫ్రాన్స్-ఆస్ట్రేలియాలు ఒక్కతాటిపైకి రావడం ఇదే తొలిసారి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ షింగ్రే, ఫ్రాన్స్ విదేశాంగ శాఖ సెక్రటరీ జనరల్ ఫ్రానోయిస్ డెలట్రే, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ సెక్రటరీ ఫ్రాన్సిస్ ఆడమ్సన్ హాజరయ్యారు.
Recommended Video
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మూడు దేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించడంపైనే ప్రధాన చర్చ జరిగిందని, బలమైన త్రైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే లక్ష్యంతో పనిచేయాలని, అలాగే, ఈ రీజియన్ లో శాంతి, సుస్థిరత, అంతర్జాతీయ నియమాల పాలన సజావుగా సాగేందుకు కృషిచేయాలనే నిర్ణయానికి వచ్చామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై భారత్-ఫ్రాన్స్-ఆస్ట్రేలియాలు ఏటేటా సమావేశం కావాలని తీర్మానించుకున్నాయని, ఈ కూటమిని విస్తృతం చేసే దిశగానూ అడుగులు వేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.