కరోనా లాక్డౌన్: 2021 దాకా తప్పదు.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీల WFH ఆదేశాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40.12లక్షలకు పెరిగింది. అందులో 11.4లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. అగ్రరాజ్యం అమెరికాలోనైతే కేసుల సంఖ్య 13.5లక్షలకు పెరగ్గా, మరణాలు 80వేలు దాటాయి. యూరప్ లోని పెద్ద దేశాల్లోనూ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అయినాసరే, చాలా దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేతకు ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. కానీ ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థలు మాత్రం తమ కార్యాలయాలు పున:ప్రారంభించేందుకు నిరాకరిస్తున్నాయి..
కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో.. దిగ్గజ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. సేఫ్టీ నేపథ్యంలో ఉద్యోగులంతా 2021 జనవరి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) ఆదేశాలను పాటించడమే బెస్టని ఆ కంపెనీలు అంతర్గత ఆదేశాలు జారీచేశాయి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఆఫీసులకు వస్తామంటే నిరాకరించబోమంటూనే.. ఉద్యోగులెవరూ ఆ పని చేయబోరంటూ యాజమాన్యాలు మెలిక ప్రకటన చేశాయి. గత ఆదేశాల ప్రకారం గుగుల్, ఫేస్ బుక్ కార్యాలయాలు జూన్-జులై నాటికి తెరుచుకోవాల్సి ఉన్నా, తాజా సూచనల మేరకు అది మరింత ఆలస్యం కానుంది.
Recommended Video
ఉద్యోగులతో వర్చువల్ మీటింగ్లో సీఈవో సుందర్ పిచాయ్ ఈ మేరకు ప్రకటన చేసినట్లు గూగుల్ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అంతకంటే ముందే, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్.. తన ఉద్యోగులను వచ్చే ఏడాది ప్రారంభం దాకా ఇళ్ల నుంచే పని చేయాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. గుగుల్, ఫేస్ బుక్ బాటలో మరికొన్ని టెక్ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పొడిగించే అవకాశాలున్నాయి.