మిత్రదేశాలకు మాల్దీవుల రాయబారులు, జాబితాలోలేని భారత్, చైనా హెచ్చరిక
మాలే: రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవులు.. సమస్య పరిష్కారం కోసం మిత్రదేశాల సాయం కోరుతోంది. అధ్యక్షులు అబ్దుల్లా యామీన్ దేశంలో సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టాలని కోరుతూ మిత్రదేశాలకు రాయబారులను పంపిస్తున్నారు. చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఈ జాబితాలో ఉండగా భారత్ మాత్రం లేదు.
మాల్దీవుల్లో సంక్షోభంలో భారత సైన్యం జోక్యం చేసుకోవద్దని, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయొద్దని, అది మాల్దీవుల అంతర్గత అంశమని చైనా హెచ్చరించిన తర్వాత కొద్ది సేపటికే మాల్దీవులు అధ్యక్షులు మిత్ర దేశాలకు రాయబారులను పంపుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ పలుమార్లు భారత్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని అభ్యర్థించారు. చైనా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ రాయబారులు, సైన్యాన్ని తమ దేశానికి పంపి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. ఈ నేపథ్యంలోనే చైనా మాల్దీవులు విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది.